Kiran Kumar Reddy: భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం , లోక్ సభ స్పీకర్ వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ,ఇతర విపక్ష ఎంపీలకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా స్పీకర్ అడ్డుకుంటున్నారని చామల ఆరోపించారు. కేవలం బీజేపీ ,ఎన్డీఏ ఎంపీలకే ప్రాధాన్యత ఇస్తూ.. నిశికాంత్ దూబే, అనురాగ్ ఠాకూర్ వంటి వారికి అనవసరంగా మైక్ ఇస్తున్నారని ఆయన విమర్శించారు. 18వ లోక్ సభలో ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిస్తూ, మహిళా ఎంపీలపై తప్పుడు ప్రకటనలు చేయడం ద్వారా ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపిస్తున్నారని మండిపడ్డారు.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వతంత్రంగా వ్యవహరించకుండా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాల విషయంలో వైట్ హౌస్ నిర్ణయాలకు మోదీ తలొగ్గడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంపై చర్చ జరగాలని, రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోలు విషయంలో ట్రంప్ భారత్పై ఒత్తిడి తేవడం మన సార్వభౌమాధికారానికి గొడ్డలిపెట్టు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
దేశంలో విపరీతంగా పెరిగిన గ్యాస్, క్రూడాయిల్ ధరలపై చర్చించాలని డిమాండ్ చేస్తూ.. పార్లమెంట్ నియమాలను ఉల్లంఘించి ఎనిమిది మంది ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. అవిశ్వాస తీర్మానంపై ఓటు వేసే హక్కు సభలోని 543 మంది సభ్యులకు ఉండాలని.. సస్పెండ్ అయిన వారికి కూడా ఆ అవకాశం ఇవ్వాలని కోరారు.
‘ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి’ అనే నినాదంతో లోక్ సభ మకర్ ద్వార్ వద్ద ధర్నా చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, ఏ ఇతర దేశం లేదా నాయకుడి ఆదేశాలకు లొంగిపోవాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.
Also Read: జడ్జికే ‘డిజిటల్’ షాక్.. ఏకంగా రూ. 1.66 కోట్లు నొక్కేసిన సైబర్ కేటుగాళ్లు!
ప్రతిపక్ష ఎంపీలను, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని మాట్లాడానివ్వకుండా స్పీకర్ అడ్డుకుంటున్నారు : ఎంపీ చామల
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం పెట్టాం
స్పీకర్ అనే వ్యక్తి లోక్ సభలో ఉన్న అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలి
18వ లోక్ సభలో ప్రతిపక్షాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు… pic.twitter.com/FUTzn9Yz0V
— BIG TV Breaking News (@bigtvtelugu) March 9, 2026