SIR Notices: స్వేచ్ఛ బ్యూరో: మేడ్చల్ జీహెచ్ఎంసీ పరిధిలో గతంలో SIRలో దరఖాస్తు చేసుకున్న ప్రజలకు ప్రస్తుతం 50 శాతం నోటీసులు జారీ అవుతుండటంతో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. మేడ్చల్ జీహెచ్ఎంసీ పరిధిలోని మూడు డివిజన్లలో మొత్తం 66,503 మంది ఓటర్లు ఉండగా.. 31,276 నోటీసులు జారీ చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీంతో భారీ సంఖ్యలో ప్రజలు నోటీసుల ప్రక్రియతో సంబంధం ఉన్న సవరణలు, వివరణల కోసం అధికారులను సంప్రదించాల్సిన పరిస్థితి ఏర్పడింది.దరఖాస్తుదారులు SIR ఫారంలో తమ పేరు, తండ్రి పేరు, ఇంటి నంబర్, చిరునామా తదితర వివరాలను సక్రమంగా నమోదు చేసినప్పటికీ, వాటిని అధికారులు ఆన్లైన్లో టైప్ చేసే సమయంలో పేర్లు, చిరునామాలు, ఇతర వివరాల్లో పొరపాట్లు చోటుచేసుకుంటున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు.
అధికారులు నమోదు చేసే సమయంలో జరిగిన చిన్నపాటి పొరపాట్లు సైతం ప్రజలకు పెద్ద సమస్యగా మారుతున్నాయి. రికార్డుల్లో వివరాలు తప్పుగా నమోదవడంతో వాటిని సరిచేయించుకునేందుకు దరఖాస్తుదారులు తమ సొంత పనులు, ఉపాధిని వదిలి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది.ఒక్క అక్షరం తప్పుగా టైప్ చేసినా.. దాని ప్రభావం మాత్రం ఓటరుపైనే! అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వివరాలను నమోదు చేసిన వెంటనే వాటిని మరోసారి పరిశీలించి ఉంటే ఇలాంటి సమస్యలు తలెత్తేవి కావని స్థానికులు అంటున్నారు. ముఖ్యంగా రోజువారీ కూలీలు, వృద్ధులు, మహిళలు తమ పనులు మానుకుని కార్యాలయాలకు రావాల్సి రావడం తీవ్ర ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు. ఒకసారి వచ్చినా సమస్య పరిష్కారం కాకపోవడంతో పలుమార్లు తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు.
Also read: భారీ వర్షాలకు దెబ్బతిన్న ట్రాక్.. రైళ్ల రాకపోకలకు బ్రేక్!
మేడ్చల్ జీహెచ్ఎంసీ పరిధిలో మూడు డివిజన్ల పరిధిలో 66,503 మంది ఓటర్లకు గాను 31,276 నోటీసులు జారీ కావడం ద్వారా ఈ ప్రక్రియ ఎంత పెద్ద స్థాయిలో కొనసాగుతుందో అర్థమవుతోంది. ఇంత పెద్ద సంఖ్యలో నోటీసులు జారీ చేస్తున్న సమయంలో అధికారులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉండగా, వివరాల నమోదులో పొరపాట్లు చోటుచేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల దరఖాస్తులను సక్రమంగా నమోదు చేయాల్సిన అధికారుల తప్పిదాలకు సామాన్య ప్రజలు ఎందుకు కార్యాలయాల చుట్టూ తిరగాలి? అంటూ బాధితులు ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి SIR ఫారాల్లో ప్రజలు ఇచ్చిన అసలు వివరాలను, అధికారులు నమోదు చేసిన వివరాలతో పోల్చి పరిశీలించాలని, తప్పులను వెంటనే సరిచేయాలని, సవరణల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి ప్రజలకు అనవసర తిప్పలు లేకుండా చూడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Also read: పాకిస్తాన్ కోచ్ లుగా షోయబ్ అక్తర్, అఫ్రిదిలను పెట్టుకోండి..!