BJP Counter : కిషన్ రెడ్డి అటాక్
చండూరు సభలో బీజేపీపై సీఎం కేసీఆర్ చేసిన విమర్శలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ పాత రికార్డును ప్లే చేశారని మండిపడ్డారు. అభద్రతాభావం కేసీఆర్లో కనిపించిందన్నారు. పరోక్షంగా ఓటమిని అంగీకరించారని చెప్పారు. వేరే పార్టీ గుర్తుపై గెలిచిన వారిని టీఆర్ఎస్ లో చేర్చుకున్నారని మండిపడ్డారు. ఫిరాయింపులకు కేరాఫ్ అడ్రస్ కేసీఆర్ కుటుంబమేనని ఆరోపించారు. టీఆర్ఎస్కు ఎందుకు మద్దతిస్తున్నారో వామపక్షాలు పరిశీలించుకోవాలని హితవు పలికారు. నలుగురు ఎమ్మెల్యేలను హీరోలుగా కేసీఆర్ చెప్పారని కానీ ఆ నేతలు పార్టీ ఫిరాయించిన వారేనని గుర్తు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులోని ఎఫ్ఐఆర్లో డబ్బు విషయం ఎందుకు పొందుపర్చలేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. జీఎస్టీ టారిఫ్ నిర్ణయించింది కేంద్రం కాదని.. జీఎస్టీ కౌనిల్స్ అని తెలిపారు. చేనేత కార్మికులపై ప్రేమ ఉంటే జీఎస్టీ కౌన్సిల్లో ఎందుకు వ్యతిరేకించలేదని కేసీఆర్ ను కిషన్ రెడ్డి నిలదీశారు.
వాజ్పేయి తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్లోరైడ్ సమస్యను పూర్తిగా పక్కన పెట్టిందని.. మోదీ ప్రభుత్వం తెలంగాణలో ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి రూ. 800 కోట్లు ఖర్చు చేసిందని కిషన్ రెడ్డి తెలిపారు. యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేసిన కేసీఆర్.. అప్పుడెందుకు మాట్లాడలేదన్నారు. ఇప్పటి వరకు మునుగోడుకు నీళ్లు ఎందుకు ఇవ్వలేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఇదే మునుగోడు ఎన్నికల సభలో గతంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కేసీఆర్ వద్ద అంత పెద్ద సినిమా ఉంటే ఎందుకు న్యాయస్థానానికి వెళ్లలేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కుంభకోణాలు కప్పిపుచ్చుకోవడానికే సీబీఐని అడ్డుకున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈడీ, ఐటీ, సీబీఐ అంటే కేసీఆర్ ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని అని ప్రశ్నించారు.
బండి సంజయ్ కౌంటర్
37 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదిరిగా కొన్న సీఎం కేసీఆర్ .. ఎమ్మెల్యేల భేరసారాల గురించి మాట్లాడటం సిగ్గుచేటని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేస్తుంటే.. కేసీఆర్ ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆరోపించారు. మునుగోడు ప్రజలకు ఏం చేస్తారో కేసీఆర్ చెప్పలేదన్నారు. ఉపఎన్నికలో ఓడిపోతామని తెలిసినా.. చండూరు సభలో కేసీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారని విమర్శించారు. 2018లో ఎన్నికల సమయంలో చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేశారా? అని ప్రశ్నించారు. చేనేత ముడిసరుకులపై 50 శాతం రాయితీ ఎందుకివ్వడం లేదని అడిగారు. కేసీఆర్ టోపీ పెట్టుకుని వచ్చి మునుగోడు ప్రజల నెత్తిన టోపీ పెట్టి వెళ్లిపోయారని బండి సంజయ్ విమర్శించారు.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తప్పు చేయనప్పుడు కేసీఆర్ యాదాద్రికి వచ్చి ఎందుకు ప్రమాణం చేయట్లేదని బండి సంజయ్ నిలదీశారు. సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. మునుగోడు ఉపఎన్నిక తర్వాత మీటర్ల పేరు చెప్పి విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. డిస్కమ్లు నష్టాల్లో ఉండటానికి కారణం సీఎం కాదా? అని బండి సంజయ్ ప్రశ్నించారు.