Telangana BJP: స్వేఛ్చ బ్యూరో: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరింది. ప్రచార పర్వం ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఈనెల 11న జరిగే పోలింగ్పైనే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో 2,996 వార్డులకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రచారం ముగిసిన తరుణంలో కాషాయ పార్టీ పోల్ పోల్ మేనేజ్మెంట్ పై దృష్టిని కేంద్రీకరిస్తోంది. ప్రతి బూత్ తో పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే డోర్ టు డోర్ ప్రచారం చేపట్టిన పార్టీ.. ప్రతి ఇంటికీ సంకల్ప పత్రం పేరిట మేనిఫెస్టోను అందించింది. కేంద్రం.. తెలంగాణకు ఏమిచ్చిందనే అంశంపై వివరించింది. చివరకు మైకులు మూగబోవడంతో సైలెంట్ క్యాంపెయిన్ కు తెరలేపింది.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి కాషాయ పార్టీ రెండు బహిరంగ సభలు నిర్వహించింది. ఒక సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాగా మరో సభకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హాజరయ్యారు. మిగతాప్రాంతాల్లో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు డోర్ టు డోర్, రోడ్ షోలు, స్ట్రీట్ కార్నర్ మీటింగులు నిర్వహించారు. కాగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి పోలింగ్ బూత్లో కనీసం 50 శాతం ఓట్ షేర్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం బూత్ స్థాయి కమిటీలను పటిష్టం చేస్తూ, ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించే బాధ్యతను పన్నా ప్రముఖ్ లకు పార్టీ అప్పగించింది.
Also Read: Italy Robbery: హాలీవుడ్ సిన్మా మాదిరిగా ఇటలీ హైవేపై భారీ దోపిడీ..నగదు వ్యాన్ పేల్చివేత, వీడియో వైరల్
ఈ ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే మున్సిపల్ పోరు కోసం ఇతర రాష్ట్రాల సీనియర్ నాయకులను రంగంలోకి దించింది. మహారాష్ట్రకు చెందిన ఆశిష్ షేలార్ ఎన్నికల ఇన్ చార్జీగా నియమించింది. సహ ఇన్ చార్జీలుగా రాజస్థాన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు అశోక్ పర్నామి, రాజ్యసభ సభ్యురాలు రేఖా శర్మను పార్టీ నియమించింది. హైకమాండ్ రచించిన వ్యూహాలను తూచ తప్పకుండా అమలుచేయించడంలో వారు కీలకంగా ఉన్నారు. ఇకపోతే.. ఓటర్లను ఆకర్షించేందుకు బీజేపీ తన ఐటీ సెల్, సోషల్ మీడియా విభాగాన్ని పూర్తిస్థాయిలో వాడుకుంటోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, కేంద్ర పథకాలను వివరించడంతో పాటు, పోలింగ్ రోజున ఓటర్లకు అవసరమైన సమాచారాన్ని డిజిటల్ మాధ్యమాల ద్వారా చేరవేసేలా ప్లాన్ చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం అధికారికంగా ముగిసినా.. ఇక సైలెంట్ క్యాంపెయిన్ మొదలవ్వనుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంలో భాగంగా మైక్రో మేనేజ్ మెంట్ కు శ్రీకారంచుట్టింది. బస్తీలు, కాలనీల్లోని స్థానిక ఇన్ఫ్లుయెన్సర్లను కలవడం ద్వారా ఓటు బ్యాంకును పటిష్టం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా నిరుద్యోగులు, యువతను తమవైపు తిప్పుకునేందుకు పార్టీ ప్రాధాన్యతనిస్తోంది. బీజేపీ తన మున్సిపల్ మేనిఫెస్టో ‘వికసిత్ తెలంగాణ-సంకల్ప పత్రం 2026’ ద్వారా ప్రజల్లోకి వెళ్తోంది. ఇంటి పన్ను పెంచబోమని, అవినీతి రహిత పారదర్శక పాలన అందిస్తామని హామీ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఓట్లుగా మార్చుకోవాలని బీజేపీ భావిస్తుంటే, అధికార పక్షం, బీఆర్ఎస్ కూడా తమ పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ త్రిముఖ పోటీలో బీజేపీ అనుసరిస్తున్న మైక్రో పోల్ మేనేజ్మెంట్ వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో తెలియాలంటే ఈనెల 13న వరకు వేచి చూడాల్సిందే.
Also Read: Shahid Afridi on PCB: పాకిస్తాన్ పరువును ఇండియాకు అమ్మేశారు..ఇక అందరూ బావిలో దూకి, చావండి