CM Revanth Reddy: దేశంలోని దళిత, ఆదివాసీ, బలహీన వర్గాల ఓటు హక్కును కాలరాసేందుకు కుట్రలు జరుగుతున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో నిర్వహించిన ‘ఓటు చోరీ’ వ్యతిరేక ధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ విధానాలపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారు కల్పించిన ఓటు హక్కు ద్వారానే నేడు దేశంలో రాజ్యాంగం, రిజర్వేషన్లు అమలవుతున్నాయని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. గత ఎన్నికల్లో 400 స్థానాలు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్లు ఎత్తివేస్తారని ప్రజలు భయపడి బీజేపీకి తగిన బుద్ధి చెప్పారని ఆయన వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని మార్చే అవకాశం నేరుగా రాకపోవడంతో, ఇప్పుడు దొడ్డిదారిన ఓట్ల తొలగింపు ప్రక్రియకు తెరలేపారని విమర్శించారు.
ప్రస్తుతం ఎస్ఐఆర్ (SIR) పేరుతో జరుగుతున్న ప్రయత్నాలు అత్యంత ప్రమాదకరమని ముఖ్యమంత్రి హెచ్చరించారు. “తొలుత ఓటరు కార్డును తొలగిస్తారు, ఆపై ఆధార్, రేషన్ కార్డులను రద్దు చేస్తారు. తద్వారా పేదలు తమ భూములను, హక్కులను కోల్పోయే ప్రమాదం ఉంది. ఇది కేవలం ఎన్నికల సమస్య మాత్రమే కాదు, దేశ మనుగడకు సంబంధించిన సమస్య” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
నాడు పేదలు, దళితుల కోసం గాంధీ, అంబేద్కర్ ఎలా నిలబడ్డారో.. నేడు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే అదే విధంగా పోరాడుతున్నారని రేవంత్ రెడ్డి కొనియాడారు. రాహుల్ గాంధీ ఒక సైనికుడిలా దేశం కోసం పోరాడుతున్నారని, ఆయనకు ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. చివరిగా.. ఈ అప్రజాస్వామిక చర్యలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ చేసే పోరాటంలో తెలంగాణ రాష్ట్రం ఎల్లప్పుడూ ముందుంటుందని, దేశ ప్రజలంతా ఏకమై ఓటు హక్కును కాపాడుకోవాలని ఆయన కోరారు.
ALSO READ: KCR: రైతుల నీటి హక్కులపై ఉద్యమానికి సిద్ధమైన బీఆర్ఎస్.. కేసీఆర్ అధ్యక్షతన సమావేశం