KCR: తెలంగాణలో రైతుల సాగునీటి హక్కుల పరిరక్షణే ధ్యేయంగా బీఆర్ఎస్ కీలక ఉద్యమానికి సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని ప్రాజెక్టుల నిర్వహణ, కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన వాటాపై ప్రభుత్వ వైఖరిని నిలదీసేందుకు పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగనున్నారు. ఈ క్రమంలో ఈ నెల 19వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ శాసనసభాపక్ష (బీఆర్ఎస్ఎల్పీ) సమావేశాన్ని నిర్వహించనున్నారు.
గత కొంతకాలంగా అనారోగ్యం, విశ్రాంతి కారణంగా పార్టీ కార్యకలాపాలకు, ముఖ్యంగా తెలంగాణ భవన్కు దూరంగా ఉంటున్న కేసీఆర్.. చాలా రోజుల తర్వాత పార్టీ కార్యాలయానికి వస్తుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ సమావేశానికి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కీలక నేతలు హాజరుకానున్నారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలు, నీటి విడుదల విషయంలో నెలకొన్న గందరగోళంపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించనున్నారు.
ముఖ్యంగా కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కి అప్పగించే అంశంపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును కేసీఆర్ తీవ్రంగా తప్పుబడుతున్నట్టు తెలుస్తోంది. గోదావరి జలాల వినియోగంపై కూడా స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని ఆయన భావిస్తున్నారు. ప్రాజెక్టుల నిర్వహణను కేంద్రానికి అప్పగిస్తే రాష్ట్ర ప్రయోజనాలకు గండి పడుతుందని.. దీనిపై రైతులను చైతన్యపరచడానికి భారీ ఉద్యమ కార్యాచరణను ఈ సమావేశంలో ప్రకటించే అవకాశం ఉంది.
తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న సాగునీటి ఇబ్బందులు, ఎండిపోతున్న పంట పొలాల అంశంపై క్షేత్రస్థాయిలో పోరాటాలను ఉధృతం చేయాలని పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా అసెంబ్లీ లోపల, బయట అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించి.. రైతు పక్షపాతిగా బీఆర్ఎస్ తన పంథాను మరోసారి చాటనుంది. ఈ సమావేశం ద్వారా పార్టీ కేడర్లో కొత్త ఉత్సాహం నింపడంతో పాటు.. భవిష్యత్ రాజకీయ పోరాటాలకు పునాది వేయాలని కేసీఆర్ యోచిస్తున్నారు.
ALSO READ: Kalvakuntla Kavitha: హైదరాబాద్ను పట్టించుకోకుంటే తాటతీస్తాం..! సీఎంపై కవిత సంచలన వ్యాఖ్యలు