Nerella Incident: స్వేచ్చ బ్యూరో: సిరిసిల్ల జిల్లా నేరెళ్ల గ్రామంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న థర్డ్ డిగ్రీ ఘటనలో బాధితుడైన గంధం గోపాల్ శనివారం అనారోగ్యంతో మృతి చెందారు. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటనలో పోలీసుల థర్డ్ డిగ్రీకి గురైన ఎనిమిది మంది బాధితుల్లో గోపాల్ ఒకరు. ఆయన మృతితో నేరెళ్ల ఘటన మరోసారి రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ సందర్భంగా మిగిలిన బాధితులు మరోసారి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. థర్డ్ డిగ్రీ బాధితులు బానయ్య, కోల హరీష్ మాట్లాడుతూ.. ఘటన జరిగి దాదాపు పదేళ్లు గడిచినా తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినా తమ జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని, న్యాయం కోసం తాము చేయని పోరాటం లేదన్నారు. తమపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి జీవితాలను ఛిన్నాభిన్నం చేసిన పోలీసు అధికారులపై ఇప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Also Read: TGSPDCL: ఈ దారుణాలకు బాధ్యులెవరు.. వణుకు పుట్టిస్తున్న విద్యుత్ శాఖ రిపోర్ట్..!
గంధం గోపాల్ మృతి..
అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ నాయకులు తమకు అండగా నిలిచారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సమస్యను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. గంధం గోపాల్ మృతితో నేరెళ్ల థర్డ్ డిగ్రీ బాధితులకు న్యాయం చేయాలనే డిమాండ్ మరోసారి బలంగా వినిపిస్తోంది. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించి బాధితులకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.
Also Read: Investment Fraud: హైదరాబాద్లో మరో విజయ్ మాల్యా లాంటి మోసం.. రూ. 50 కోట్లతో భార్య భర్తలు జంప్..!