BJP Laxman: మహిళా బిల్లును అడ్డుకున్న స్టాలిన్ కు ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో రేవంత్ రెడ్డికి కూడా గుణపాఠం తప్పదని ఆరోపించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఎంసీ రాక్షస పాలన నుంచి విముక్తులమయ్యామని బెంగాల్ ప్రజలు సంబురాలు చేసుకుంటున్నారని తెలిపారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కాకుండా అన్ని రాష్ట్రాల్లో మోడీ అభివృద్ధి దిశగా పాలన సాగిస్తున్నారన్నారు. మే 10న మోడీ హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో ప్రజలు బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఆయన రాక తర్వాత తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పు సంభవించబోతోందని స్పష్టంచేశారు. పదేండ్లు తెలంగాణలో ఒక కుటుంబం దోచుకుంటే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఢిల్లీ పెద్దల కోసం దోచి పెడుతున్నాడని లక్ష్మణ్ విమర్శించారు. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. తమిళనాడులో డబ్బును వెదజల్లినా ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ప్రధాని మోదీ తెలంగాణలో అడుగుపెడుతుండటంతో రాష్ట్ర ప్రజల్లో విపరీతమైన ఆసక్తి, ఉత్సాహం కనిపిస్తోందని లక్ష్మణ్ అన్నారు. ఆయన రాక కోసం ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో, బీజేపీ పాలిత అస్సాంను మినహాయిస్తే, మిగతా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందని గుర్తుచేశారు. అవినీతి, కుటుంబ పాలన, ప్రజా వ్యతిరేక విధానాల కారణంగా ఆ ప్రభుత్వాలను ప్రజలు తిరస్కరించారని పేర్కొన్నారు.
Also Read: Auto-Pay సబ్ స్క్రిప్షన్లతో అల్లాడుతున్నారా? ఈ స్టెప్స్ పాటిస్తే చాలు.. మీ డబ్బులు సేఫ్!
తెలంగాణలో కూడా ప్రజలు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల పాలనపై విసుగుతో ఉన్నారని లక్ష్మణ్ ఆరోపించారు. ఈ రెండు పార్టీలూ రాష్ట్ర సంపదను దుర్వినియోగం చేశాయని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును ఎవరైనా గౌరవించాల్సిందేనని, దానిని అంగీకరించకుండా పోతే ఆ పార్టీలు రాజకీయంగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని లక్ష్మణ్ హెచ్చరించారు. తెలంగాణలో అహంకారపూరిత పాలనను ప్రజలు ఇప్పటికే తిరస్కరించారని, కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరుగుతోందన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని లక్ష్మణ్ ధీమా వ్యక్తంచేశారు.
Also Read: ఇంత తక్కువ ధరకే ఫ్లాగ్షిప్ ఫోనా? Motorola Edge 30 Proపై దిమ్మతిరిగే ధర తగ్గింపు!