Nitin Nabin: స్వేచ్ఛ బ్యూరో: ప్రతికూల వాతావరణాన్ని తట్టుకుని పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రంలోనే బీజేపీ అధికారంలోకి వచ్చిందని, అలాంటిది తెలంగాణలో అధికారంలోకి రాలేమా? అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా టీబీజేపీ వ్యవహారాల ఇన్ చార్జీలకు దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. బేగంపేట హరిత ప్లాజాలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీలతో సోమవారం నితిన్ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అధ్యక్షతన జరిగిన కీలక భేటీలో అభయ్ పాటిల్, సునిల్ బన్సల్, చంద్రశేఖర్ తివారి, ఆశిష్ షెల్లార్, రేఖా శర్మ, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సమావేశం దాదాపు 40 నిమిషాల నుంచి గంటపాటు కొనసాగినట్లు తెలుస్తోంది. కాగా నితిన్ నబీన్ ను కలిసేందుకు పాలమూరు ఎంపీ డీకే అరుణ వెళ్లగా.. సమయం లేకపోవడంతో భేటీ కుదరలేదని సమాచారం.
ప్రజల్లోకి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు
ఇదిలాఉండగా పార్టీ సంస్థాగత బలోపేతం, బూత్ కమిటీల పనితీరుపై, పార్టీ పరిస్థితి, అధికారంలోకి వచ్చేందుకు చేపట్టాల్సిన అంశాలపై సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. తెలంగాణలో బీజేపీ పార్టీకి అనుకూల వాతావణం ఉందని, ప్రజలు బీజేపీకి అధికారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని వివరించినట్లు చెబుతున్నారు. తెలంగాణ నేతలు ఇలాగే ఉంటే పార్టీ ముందుకు పోదని, ఇకనైనా మారాలని నేతలకు దిశానిర్దేశం చేసినట్లు వినికిడి. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి మరింత సమర్థవంతంగా తీసుకెళ్లాలని నేతలకు మార్గదర్శనం చేసినట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా వరంగల్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చిన నితిన్ నబీన్ బీజేపీ ఆఫీస్ బేరర్లతో సమావేశమయ్యారు. వారికి తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడం, అధికారంలోకి తీసుకురావడంపై దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది.
Also Read: జగన్ ‘యూ-టర్న్’.. చంద్రబాబు ‘సూపర్ సిక్స్’.. పెన్షన్ల పెంపుపై ఎమ్మెల్యే నసీర్ సంచలన వ్యాఖ్యలు!
నేడు రాష్ట్ర కార్యవర్గ సమావేశం
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఘట్ కేసర్ లో మంగళవారం జరగనుంది. కాగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కు హాజరవుతారు. తొలుత ఆయన స్టేట్ ఆఫీస్ బేరర్లతో సమావేశమై.. ఆపై స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ను ప్రారంభిస్తారు. ఆఫీస్ బేరర్లకు కీలక అంశాలపై దిశానిర్దేశం చేస్తారు. ఇదిలా ఉండగా నితిన్ నబీన్ గతంలో ఒకమారు తెలంగాణలో పర్యటించారు. కాగా ఇప్పుడు రావడం రెండోసారి. అయితే.. హైదరాబాద్ నగరంలో ఈ స్థాయిలో పార్టీ కార్యక్రమంలో పాల్గొనడం ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో జరిగే ఈ సమావేశం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
కార్యవర్గ సమావేశానికి నితిన్ నబీన్
ఇదిలా ఉండగా ఆర్ఎస్ఎస్ ముఖ్య నేతలతో సైతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మంగళవారం భేటీ అవ్వనున్నారు. మంగళవారం ఉదయం ఆర్ఎస్ఎస్ నేతలతో కలిసి ఆయన బ్రేక్ ఫాస్ట్ చేయనున్నారు. ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో జరిగే కార్యక్రమానికి తెలంగాణలో ఉన్న సంఘ్ పరివార్ క్షేత్ర నేతలు హాజరవ్వనున్నారు. ఈ సమావేశంలో తాజా రాజకీయలపై చర్చించే అవకాశముందని సమాచారం. పార్టీలోని అంతర్గత అంశాలపై నితిన్ ఆరా తీసే అవకాశాలున్నట్లు సమాచారం. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతో మీటింగ్ అనంతరం ఘట కేసర్ లో జరిగే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి నితిన్ నబీన్ హాజరవుతారు.