Ramachandra Rao: సింగరేణి పరిధిలోని నైని కోల్ బ్లాక్ కేటాయింపుల వ్యవహారంపై తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేగుతోంది. ఈ కుంభకోణంపై తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రామచంద్ర రావు ఢిల్లీ వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నైని బ్లాక్ వివాదంపై కేవలం రాష్ట్ర స్థాయి విచారణ సరిపోదని, దీనిపై సీబీఐ (CBI) లేదా ఏదైనా కేంద్ర దర్యాప్తు సంస్థతో సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో పారదర్శకత లోపించిందని, కేవలం ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య తలెత్తిన వాటాల వివాదం కారణంగానే ఈ అవినీతి వెలుగులోకి వచ్చిందని ఆయన ఆరోపించారు.
మీడియాలో వార్తలు వచ్చిన తర్వాతే నైని బ్లాక్ టెండర్లను రద్దు చేశారని, అంతకుముందు వరకు ఎందుకు మౌనంగా ఉన్నారో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలని రామచంద్ర రావు డిమాండ్ చేశారు. సింగరేణిని అవినీతికి నిలయంగా మార్చడంలో బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీలు సమాన పాత్ర పోషించాయని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో సింగరేణి కార్మికులకు అనేక వాగ్దానాలు చేసి మోసం చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తన బంధువులకు కోల్ బ్లాక్ కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. నైని బ్లాక్ కేటాయింపుల్లో ఎవరికి ఎంత కమిషన్ ముట్టిందో ప్రభుత్వం బహిరంగ పరచాలని ఆయన డిమాండ్ చేశారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను రామచంద్ర రావు కొట్టిపారేశారు. “కిషన్ రెడ్డికి లేఖ రాసే నైతిక హక్కు బీఆర్ఎస్కు లేదు. వారేమీ సుద్దపూసలు కాదు. రాష్ట్రాన్ని మొదట భ్రష్టు పట్టించింది బీఆర్ఎస్ అయితే, కాంగ్రెస్ దాన్ని కొనసాగిస్తోంది.” అని ఆయన ధ్వజమెత్తారు. సింగరేణిలో 49 శాతం వాటా కేంద్రానిది ఉన్నప్పటికీ, పూర్తి నియంత్రణ రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. హరీష్ రావు వంటి నేతలు నీతులు మాట్లాడటం మానుకోవాలని, బీఆర్ఎస్ పదేళ్ల పాలనలోని అవినీతితో పాటు ప్రస్తుత కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై కూడా విచారణ జరగాలని కోరారు.
కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక ATM గా వాడుకుందని, లక్షా 30 వేల కోట్లు ఖర్చు చేసినా ఫలితం లేదని ఆయన ఆరోపించారు. అలాగే, ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ రెండేళ్లుగా సాగుతున్నా ఇప్పటి వరకు రాజకీయ నేతలను ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో సీబీఐ రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకుంటూ తెచ్చిన జీవోను కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఎందుకు ఎత్తివేయలేదని నిలదీశారు. సింగరేణి ఉద్యోగులకు, తెలంగాణ ప్రజలకు ఈ రెండు పార్టీలు క్షమాపణ చెప్పాలని, ఈ భారీ అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణే శరణ్యమని రామచంద్ర రావు స్పష్టం చేశారు.
Read Also: ప్రపంచ వేదికపై సీఎం రేవంత్ కీలక ప్రసంగం.. ఏఐ యుగంలో తెలంగాణ రైజింగ్!