Telangana Rising 2047: స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) 2026 సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానంపై తన విజన్ను చాటిచెప్పారు. ‘ఇంటెలిజెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ బిల్డింగ్ కంపెటిటివ్ నెస్’ అనే అంశంపై జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను వినియోగించి పౌర సేవలను విప్లవాత్మకంగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు.
రైతు భరోసా వంటి సబ్సిడీల ట్రాకింగ్, ఆస్తి పన్ను వసూళ్లు, మహిళా సంక్షేమ పథకాల అమలు, పట్టణ మున్సిపల్ సమస్యల పరిష్కారంలో తెలంగాణ ఇప్పటికే ఏఐ పరిష్కారాలను అమలు చేస్తోందని సీఎం వివరించారు. ఏఐని సరైన దిశలో వినియోగిస్తే పాలనలో పారదర్శకత, వేగం పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
అదునాతన ఏఐ యుగంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉండలేవని, మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా వేగంగా నిర్ణయాలు తీసుకోవడం మరియు ముందస్తు చర్యలు చేపట్టడం అత్యవసరమని ఆయన నొక్కి చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం రూపొందించిన ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ను ముఖ్యమంత్రి ఈ వేదికపై ఆవిష్కరించారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ అంతిమ లక్ష్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
హైదరాబాద్ ప్రస్తుతం గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లకు (GCC) చిరునామాగా మారిందని, ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులను ఆకర్షించాలంటే మేధోవంతమైన వ్యవస్థలను నిర్మించక తప్పదని సీఎం పేర్కొన్నారు.
ఈ సమావేశంలో స్మార్ట్ ఫ్యాక్టరీలు, స్థిరమైన ఇంధన వ్యవస్థలు, స్మార్ట్ సిటీల నిర్మాణంపై అంతర్జాతీయ స్థాయి చర్చలు జరిగాయి. ఈ సదస్సులో ఈజిప్ట్ మంత్రి హస్సన్ ఎల్కహతీబ్, నోకియా సీఈఓ జస్టిన్ హోటార్డ్, హిటాచి సీఈఓ తోషియాకి టోకునాగా వంటి ప్రపంచ స్థాయి ప్రముఖులు పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలను అభినందించారు.
Read Also: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల భారీ మోసం…. కరాటే కళ్యాణిపై దాడి.. ఎందుకంటే?