నిరుద్యోగ యువతకు భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ తీపి కబురు అందించింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 22,000 గ్రూప్-డి (లెవల్-1) పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ (CEN No. 09/2025)ను విడుదల చేసింది. రైల్వేలో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు ఇది ఒక అద్భుతమైన అవకాశంగా నిలవనుంది.
దరఖాస్తు తేదీల్లో మార్పు..
ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వేలోని వివిధ విభాగాల్లో ఉన్న పాయింట్స్మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ వంటి కీలక పోస్టులను భర్తీ చేయనున్నారు. గతంలో జనవరి 21 నుంచే దరఖాస్తులు ప్రారంభం కావాల్సి ఉండగా, తాజాగా మారిన షెడ్యూల్ ప్రకారం జనవరి 31 నుంచి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. అర్హులైన అభ్యర్థులు మార్చి 3, 2026 వరకు తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.
అర్హతలు, వయస్సు వివరాలు..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి పదో తరగతి (10th Class) లేదా ఐటీఐ (ITI) ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18 నుండి 33 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపులు కల్పించారు. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, మరియు దివ్యాంగ అభ్యర్థులకు (PwBD) 10 ఏళ్ల వరకు వయస్సు సడలింపు ఉంటుంది.
వేతన వివరాలు..
ఎంపికైన అభ్యర్థులకు సెవెన్త్ పే కమిషన్ ప్రకారం ఆకర్షణీయమైన జీతభత్యాలు అందుతాయి. ప్రారంభ కనీస వేతనం రూ. 18,000 కాగా, దీనికి తోడు ఇంటి అద్దె భత్యం (HRA), డీఏ వంటి ఇతర అలవెన్సులు అన్నీ కలుపుకుని నెలకు సుమారు రూ. 35,000 వరకు వేతనం లభించే అవకాశం ఉంది.
దరఖాస్తు విధానం, సెలక్షన్ ప్రాసెస్
ఆసక్తి గల అభ్యర్థులు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు తమ ఫోటో, సంతకం, విద్యా అర్హత పత్రాలను సిద్ధం చేసుకోవాలని బోర్డు సూచించింది. రాత పరీక్ష (CBT), శారీరక సామర్థ్య పరీక్ష (PET), వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు నిరంతరం అధికారిక వెబ్సైట్ indianrailways.gov.in ను సందర్శించాల్సి ఉంటుంది.