Nampally Court: నగరంలోని నాంపల్లి క్రిమినల్ కోర్టు ప్రాంగణంలో తీవ్ర కలకలం రేగింది. కోర్టులో బాంబు పెట్టామంటూ ఆగంతకులు పంపిన ఒక ఈమెయిల్ అధికారులను, సిబ్బందిని ఉలిక్కిపడేలా చేసింది. కేవలం బాంబు పెట్టడమే కాదు, ఏకంగా జడ్జి ఛాంబర్లోనే బ్లాస్ట్ చేస్తామంటూ ఆ మెయిల్లో హెచ్చరించడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఈ సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన పోలీసులు హుటాహుటిన కోర్టు వద్దకు చేరుకుని విస్తృత భద్రతా చర్యలు చేపట్టారు.
బాంబు బెదిరింపు నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా కోర్టు సిబ్బందిని, న్యాయవాదులను, కక్షిదారులను పోలీసులు వెంటనే బయటకు పంపించివేశారు. బాంబ్ డిస్పోజల్ టీమ్ (BDT), ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ISW) బృందాలు రంగంలోకి దిగి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాయి. కోర్టు ప్రాంగణాన్ని జల్లెడ పట్టేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. డాగ్ స్క్వాడ్, మెటల్ డిటెక్టర్లతో అణువణువూ శోధిస్తున్నారు. అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామంతో కోర్టు సిబ్బంది, అక్కడికి వచ్చిన సామాన్య ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ముందస్తు జాగ్రత్తగా నాంపల్లి కోర్టు వద్ద పోలీసులు భారీగా బలగాలను మోహరించారు.
నాంపల్లి కోర్టు కాంప్లెక్స్ రాష్ట్రంలోనే అత్యంత రద్దీగా ఉండే కోర్టు సముదాయాల్లో ఒకటి. ఈ కాంప్లెక్స్లో 40కి పైగా కోర్టు హాల్స్ ఉండగా, అత్యంత కీలకమైన సీబీఐ స్పెషల్ కోర్టు కూడా ఇందులోనే ఉంది. ప్రతిరోజూ ఇక్కడ సుమారు 3 వేలకు పైగా కేసుల విచారణ జరుగుతుంటుంది. దాదాపు 2 వేల మంది న్యాయవాదులు విధులకు హాజరవుతుంటారు. నిత్యం వేలాది మందితో కిటకిటలాడే ఈ ప్రాంగణంలో జడ్జి ఛాంబర్ను పేల్చేస్తామంటూ బెదిరింపులు రావడాన్ని పోలీసులు సీరియస్గా పరిగణిస్తున్నారు.
గతంలో కూడా నాంపల్లి కోర్టుకు ఇలాగే బాంబు బెదిరింపు రాగా, తనిఖీల అనంతరం అది ఫేక్ కాల్ అని తేలింది. అయితే, తాజా బెదిరింపు ఈమెయిల్ ద్వారా రావడంతో పోలీసులు దీనిపై సాంకేతిక దర్యాప్తు ప్రారంభించారు. సైబర్ క్రైమ్ పోలీసులు ఆ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపారు? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయి.
Read Also: IBomma Ravi: సైబర్ క్రైమ్ కస్టడీలోకి ఐ బొమ్మ రవి.. వెలుగులోకి సంచలన విషయాలు!