Hyderabad News: ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన విమానానికి బాంబు బెదిరింపు వ్యవహారం ఒక్కసారిగా కలకలం రేపింది. కువైట్ నుంచి శంషాబాద్కు రావాల్సిన విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. పరిస్థితి గమనించిన అధికారులు విమానాన్ని ముంబైకి దారి మళ్లించారు. అక్కడ సేఫ్ గా ల్యాండైంది. అసలేం జరుగుతోంది.
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు
కువైట్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు తీవ్ర కలకలం రేపింది. షెడ్యూల్ ప్రకారం అర్ధరాత్రి 1.30 గంటకు కువైట్ నుంచి 6ఈ 1234 విమానం హైదరాబాద్కు బయల్దేరింది. ఆ విమానం శంషాబాద్ ఎయిర్పోర్టులో ఉదయం 8.10 గంటలకు రావాల్సివుంది.
బాంబు బెదిరింపు మెయిల్ నేపథ్యంలో ఆ విమానాన్ని ముంబైకి దారి మళ్లించారు. అక్కడ సేఫ్గా ల్యాండ్ అయ్యింది. విమానాన్ని దారి మళ్లించడంతో ప్రయాణికులు ఆందోళనకు గురైయ్యారు. తమను ఎక్కడ తరలిస్తున్నారని సిబ్బందిని ప్రశ్నించినట్టు సమాచారం. థ్రెట్ మెయిల్పై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. దీనిపై సంబంధిత ఎయిర్లైన్స్ ఎలాంటి ప్రకటన చేయలేదు.
శంషాబాద్లో హైఅలర్ట్.. ఆపై దారి మళ్లింపు
నవంబర్ 23న హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బహ్రెయిన్ నుండి వస్తున్న ఓ విమానానికి ఇలాంటి బాంబు బెదిరింపు వచ్చింది. ఆ తర్వాత విమానాన్ని ముంబైకి మళ్లించారు, అక్కడ సేఫ్గా ల్యాండ్ అయ్యింది. ఇక్కడేకాదు చాలా ప్రాంతాల్లో ఇలాంటి బెదిరింపులు వస్తున్నట్లు అధికారుల మాట.
ALSO READ: పవన్ కల్యాణ్.. సిగ్గుంటే హైదరాబాద్ వదిలి వెళ్ళిపో- కాంగ్రెస్ ఎమ్మెల్సీ వెంకట్
ఇటీవలకాలంలో దేశంలోని పలు విమానాశ్రయాలకు ఇలాంటి బెదిరింపులు వస్తున్నాయి. మెయిల్స్ లేదా ఫోన్ కాల్స్ ఎవరు చేస్తున్నారో తెలీదు. కాకపోతే రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. దేశంలోని చాలా ఎయిర్పోర్టుపై హ్యాకర్ల కన్నుపడింది. ఏకంగా జీపీఎస్ స్పూఫింగ్ జరిగినట్లు కేంద్రం తేల్చింది.
దీనివల్ల విమానాలకు తప్పుడు జీపీఎస్ సిగ్నల్స్ పంపి గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్వయంగా రాజ్యసభలో వెల్లడించారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.