Telangana Politics: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లైన్ దాటుతున్నారా? డిప్యూటీ సీఎం స్థాయిలో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయా? పవన్ వ్యాఖ్యలు బ్యాక్ ఫైర్ అవుతున్నాయా? సరదాగా రైతులను ఉత్సాహపరిచేందుకు పవన్ ఏమన్నారు? తెలంగాణాలో రాజకీయ పార్టీల నేతలు ఆ స్థాయిలో ఎందుకు రియాక్ట్ అవుతున్నాయి? ఇవే ప్రశ్నలు ఇప్పుడు జనసేన నేతలను వెంటాడుతున్నాయి.
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ వెంకట్ రుసరుస
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన ఏ ఉద్దేశంతో మాటలు అన్నారో తెలీదుగానీ.. మొదటికే మోసం తెస్తున్నాయి. గతవారం రాజోలు టూర్లో రైతులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణలో అధికార-విపక్షాలు ఓ రేంజ్లో రియాక్ట్ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్. తెలంగాణ అంటే తనకు అపారమైన గౌరవం ఉందని వ్యాఖ్యానించిన మీరు, ఏపీలో డిప్యూటీ సీఎం కాగానే స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్రం గురించి ఆ విధంగా మాట్లాడడం చాలా బాధాకరమన్నారు.
సిగ్గుంటే హైదరాబాద్ వదిలి వెళ్ళిపో, లేకుంటే సినిమాలు ఆడవని హెచ్చరిక
మీరన్న మాటలకు నిజంగా సిగ్గుంటే హైదరాబాద్ వదిలి వెళ్ళి.. ఏపీలో ఉండాలన్నారు. తెలంగాణ ప్రజలు మీ సినిమాలు చూసి గౌరవిస్తుంటే.. ఈ విధంగా మాట్లాడడం సరికాదన్నారు. కచ్చితంగా తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే తెలంగాణలో మీ సినిమాలు ఆడవని తేల్చి చెప్పేశారు.
ఇప్పటివరకు ఆదరించిన తెలంగాణ ప్రజలు, యువత, తరిమికొట్టే పరిస్థితి వస్తుందన్నారు. సినిమా షూటింగ్లు చేసుకోవడానికి, వాటిని నడిపించి పోవడానికి వాళ్లు అభివృద్ధి చెందడానికి తెలంగాణ అవసరమని, కానీ తెలంగాణ ప్రాంతమంటే ఎంత వివక్షనో ఇప్పడు బయటపడిందన్నారు.
ALSO READ: న్యూఇయర్-2026 వేడుకలు.. పోలీసుల మార్గదర్శకాలు
ఇటీవల పవన్ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి కౌంటరిచ్చారు. సూర్యాపేటలో మాట్లాడిన ఆయన, కోనసీమకు తెలంగాణ దిష్టి తగలడానికి అక్కడికి వెళ్లి ఎవరు చూస్తున్నారన్నారు. అటు వైపు నుంచి హైదరాబాద్ సిటీకి భారీగా వస్తున్నారని గుర్తు చేశారు. నోటిని అదుపు చేసుకోవడం నేర్చుకోవాలంటూ మండిపడ్డారు. నర దిష్టి పడితే అక్కడ దిష్టి బొమ్మలు పెట్టుకోవాలని, ఎవరు వద్దంటారన్నారు?
గతవారం అనగా బుధవారం ఏపీలో పల్లె పండుగ 2.0 కార్యక్రమం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా రాజోలులో జరిగిన కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు. తొలుత కొబ్బరి రైతులతో ప్రత్యేకంగా మాట్లాడారు. సముద్రం నీరు కొబ్బరి తోటలోకి రావడంతో అక్కడి పంట నాశనం అయ్యింది.
పచ్చని కోనసీమను చూసి తెలంగాణ నేతలు ఈర్ష్య పడ్డారని, ఆ పచ్చదనమే రాష్ట్ర విభజనకు ఒక కారణమైందని వ్యాఖ్యానించారు. నరుడు దిష్టికి నల్ల రాయి కూడా బద్దలై పోతుందని, కోనసీమ కొబ్బరి చెట్లకు అదే జరిగిందని వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే.