ఈ ఏడాది బీఆర్ఎస్ పార్టీకి పెద్దగా కలిసి రాలేదు. జరిగిన రెండు ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పరాభవం పాలైంది.జూబ్లీహిల్స్లో సిట్టింగ్ స్థానం కోల్పోయిన బీఆర్ఎస్.. సర్పంచ్ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని చాలా ఆశించింది. కానీ, అదిపెద్దగా వర్కౌట్ అవ్వలేదని తేలింది. ఆరుగ్యారెంటీల అమలులో కాంగ్రెస్ వైఫల్యం చెందిందని బీఆర్ఎస్ పెద్దఎత్తున ప్రచారం చేసినా గ్రామాల్లోని ప్రజలు, యువత పెద్దగా పట్టించుకోలేదని సర్పంచ్ ఎన్నికల ఫలితాలను చూస్తేనే అర్థం అవుతుంది. మరో మూడ్రోజుల్లో 2025కు వీడ్కోలు పలికి కొత్త సంవత్సరం 2026కు వెల్కమ్ చెప్పేందుకు ప్రపంచంతో పాటే రాష్ట్రం సిద్ధమైంది.
బీఆర్ఎస్ పార్టీకి కొత్త ఏడాదిలోనూ చిక్కులు తప్పేలా లేవు. రేపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకైనా కేసీఆర్ వస్తారా? లేదా? అనేదానిపై ఇంతవరకు క్లారిటీ లేదు. ఈసారి నదీ జలాలపై సమగ్ర చర్చ ఉంటుందని ప్రభుత్వం తరఫున క్లారిటీ ఇచ్చారు. మరోవైపు కేసీఆర్ మాత్రం సభకు వస్తారా? రారా? అనేది చెప్పకుండా మూడు జిల్లాల్లో కృష్ణా నదీ జలాలపై భారీ బహిరంగ సభల్లో ప్రసంగించేందుకు సిద్ధమవుతున్నారు. బయట మాట్లాడేది బదులు అసెంబ్లీలో ప్రభుత్వం అడిగే ప్రశ్నలకు సమాధానం చెబితే సరిపోతుంది కదా? అని మెజార్టీ ప్రజలు కోరుతున్నారు. కేసీఆర్ అడిగే ప్రశ్నలకు సైతం ప్రభుత్వం నుంచి క్లారిటీ ఉంటుందా? అసలు ఎవరు అబద్దాలు చెబుతున్నారో తేలిపోతుందని అనుకుంటున్నారు.కేసీఆర్ రాకపోతే మాత్రం తప్పు వారివైపే ఉందని ప్రజలకు సంకేతాలు వెళ్లే అవకాశం లేకపోలేదు.
ఇదిలాఉంటే ఈ ఏడాది బీఆర్ఎస్ సీనియర్లను కేసులు వెంటాడాయి. కాళేశ్వరం కమిషన్ విచారణలో కేసీఆర్.. ఈ ఫార్ములా రేసు కేసులో కేటీఆర్ పేర్లు ప్రధానంగా వినిపించాయి. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణలో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హరీశ్ రావు పేరును ప్రస్తావించారని కథనాలు వచ్చాయి.దానిపై క్లారిటీ కరువైంది. ప్రస్తుతం ఈ కేసుల విచారణ తుది దశలో ఉన్నాయి. దీంతో వచ్చే ఏడాదిలోనూ బీఆర్ఎస్ పెద్దలను కేసులు వెంటాడే అవకాశం లేకపోలేదని రాష్ట్ర రాజకీయాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతున్నది.
ఓ వైపు కేసులు, మరోవైపు కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఎటాక్.. ఫలితంగా బీఆర్ఎస్ పార్టీ పరువు పోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నికలే టార్గెట్గా కవిత గులాబీ పార్టీ సీనియర్లపై అవినీతి ఆరోపణలు గుప్పిస్తున్నారు. త్వరలోనే పార్టీ పెట్టనున్నట్టు సంకేతాలు ఇచ్చిన ఆమె.. సమయం రాగానే క్లారిటీ ఇస్తానన్నారు. ఆమె పెట్టబోయే పార్టీ బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఇక వచ్చే ఫిబ్రవరి తర్వాత మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ.. జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. కేసులు, అవినీతి ఆరోపణలను ఎదుర్కొని బీఆర్ఎస్ ఎన్నికల్లో నిలబడగలదా? అనేది బిగ్ టాస్క్గా కానుంది. ఇంతకాలం ఫాంహౌస్కే పరిమితమైన కేసీఆర్..తాజాగా బయటకు రావడం ఆ పార్టీకి కాస్త కలిసొచ్చే అంశం.. ఆయన రాకతో బీఆర్ఎస్ కేడర్ యాక్టివ్ అయ్యే చాన్స్ ఉన్నది. ఇన్ని ఒడిదుడుకుల నడుమ గులాబీ పార్టీ వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుతుందా? చతికిల పడుతుందా? ఆ పార్టీకి దిక్కెవరు? అనేది కాలమే నిర్ణయించనుంది.