బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఓ ఎమ్మెల్యే ఇంతకాలం ఆ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. 2023 సార్వత్రిక ఎన్నికల్లో గులాబీ పార్టీ ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే, నగరంలో మాత్రం ఆ పార్టీ సత్తా చాటింది. కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో ఓట్లు అధికంగా పోలవ్వగా.. బీఆర్ఎస్ పార్టీకి మాత్రం గ్రేటర్ హైదరాబాద్ పరిధి, ఆ చుట్టుపక్కల సిటీని ఆనుకుని ఉన్న నియోజకవర్గాల్లో అధికంగా ఓట్లు పోలయ్యాయి.ఫలితంగా ఆ పార్టీకి జిల్లాల్లో సీట్లు తగ్గగా.. ఇక్కడ పెరిగాయి. నగర పరిధిలో గెలిచిన కొందరు గులాబీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. అధికార పార్టీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు. దీంతో వారి మీద అనర్హత వేటు వేయాలని కారు పార్టీ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు ఫిర్యాదు చేయగా.. ఆయన కాలయాపన చేయడంతో అది కాస్త సుప్రీంకోర్టు వరకు వెళ్లిన విషయం తెలిసిందే.
సుప్రీం కోర్టు ఆదేశాలతో బీఆర్ఎస్ పార్టీ గుర్తుమీద గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారా? లేదా అనేదానిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ జరిపారు. అందులో ఇప్పటివరకు 7 గురు ఎమ్మెల్యేలు తాము కాంగ్రెస్లో చేరలేదని.. గులాబీ పార్టీలోనే ఉన్నామని వాంగ్మూలం ఇచ్చారు. దీంతో వారికి క్లీన్ చిట్ రాగా.. మరో ముగ్గురు ఎమ్మెల్యేలపై స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పీకర్ను ఆదేశించింది. ఈ క్రమంలోనే పటానుచెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఒక్కసారిగా వాయిస్ మార్చారు. స్పీకర్ దగ్గర తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని చెప్పిన ఆయన.. నిన్న మీడియాతో తాను కాంగ్రెస్ పార్టీలో చేరి తప్పు చేశానని స్టేట్మెంట్ ఇచ్చారు.మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేయాలని పిలుపునిచ్చారు.తనకు కేసీఆర్ రాజకీయ జీవితం ఇచ్చారని చెప్పడం గమనార్హం.
ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో ముందు నుంచి కొట్లాడుతున్నది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సుప్రీంకోర్టులో కేసు వేసి మరి పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయాలని కోరారు. కాగా, కోర్టు నేరుగా ఇన్వాల్వ్ కాకుండా స్పీకర్ ద్వారా ప్రాసెస్ నడిపిస్తున్నది. అయితే, ఇటీవల సర్పంచ్ ఎన్నికల అనంతరం పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారికి డోర్లు క్లోజ్ చేశామని.. వారు వెనక్కి వచ్చినా చేర్చుకునేది లేదని స్పష్టంచేశారు. మరి ఇప్పుడు గూడెం మహిపాల్ రెడ్డి విషయంలో కేటీఆర్ ఏం చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. చేర్చుకుంటే మిగతా ఎమ్మెల్యేలు కూడా వెనక్కి వచ్చే అవకాశం లేకపోలేదని తెలుస్తున్నది. ఒకవేళ నో చెబితే వారు కాంగ్రెస్లో ఉంటారని.. అప్పుడు బీఆర్ఎస్కు సిటీలో బలం తగ్గే చాన్స్ ఉంటుందని సైతం సర్వత్రా చర్చ జరుగుతున్నది.
EV Battery: ఎలక్ట్రిక్ వెహికిల్ లో వెళ్తున్నారా? బ్యాటరీ అయిపోయే ముందు ఏం జరుగుతుందో తెలుసా?
మొన్నటివరకు కాంగ్రెస్ పార్టీతో తిరిగిన బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలు తమకు అక్కడ గుర్తింపు దక్కడం లేదని తిరిగి సొంతగూటికి వెళ్దామని ఆలోచన చేస్తున్నట్టు టాక్ వినిపిస్తున్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేసిన అభ్యర్థుల నుంచి పార్టీ మారిన వారిపై తీవ్ర ఒత్తిడి ఉన్నట్టు టాక్. మరోవైపు మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు తమకే ఇవ్వాలని మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నవారంతా అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తుండగా.. వలస ఎమ్మెల్యేల అనుచరులకు అక్కడ టికెట్లు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో తమ అనుచరులు ఎక్కడ చేజారుతారో అన్న భయం ఫిరాయింపు ఎమ్మెల్యేలను పట్టుకున్నట్టు తెలుస్తున్నదది. ఈ క్రమంలోనే మరికొందరు సైతం సొంతగూటికి వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం.మరి కేటీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారనేది రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.