బీఆర్ఎస్ పార్టీకి కొత్త టెన్షన్ పట్టుకున్నట్టు తెలుస్తున్నది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల జోరు కనిపిస్తున్నది. ఇప్పటికే అధికార పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. ఆ బాధ్యతను ఇన్చార్జి మంత్రులకు అప్పగించింది. ఎన్నికల గెలుపు బాధ్యతను సైతం వారికే అప్పగించింది.రెబల్ అభ్యర్థులు లేకుండా చూసుకోవాలని మంత్రులు, ఎమ్మెల్యేకు అధిష్టానం సూచించింది. ఇక బీజేపీ సైతం మున్సిపల్ ఎన్నికల విజయ బాధ్యతలను కొత్త ఇన్చార్జులను నియమించి వారికి అప్పగించింది. కానీ, బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇంకా మున్సిపల్ ఎన్నికల కోసం జిల్లాల వారీగా ఇన్చార్జులను నియమించలేదు. ఎందుకంటే ఆ పార్టీని కేసులు వెంటాడుతున్నాయి. సిట్ వరుసగా నోటీసులు పంపిస్తున్నది.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గతంలో పంజాగుట్ట పీఎస్లో నమోదైన ఓ కేసు విషయంలో సిట్ అధికారులు మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుకు నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. దీంతో నిన్న ఉదయం ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ విచారణకు హాజరయ్యారు. సుమారు 7 గంటల పాటు సిట్ అధికారులు ఆయన్ను విచారించారు. బయటకు వచ్చిన అనంతరం హరీశ్ రావు మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.అయితే, మరోసారి విచారణకు పిలిస్తే రావాలని సిట్ అధికారులు ఆయనకు చెప్పినట్టు తెలుస్తున్నది. దీని బట్టి ఈ కేసు విచారణ ఇంతటితో ముగియలేదని తెలుస్తున్నది.
మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నవేళ ఆశావహులు భారీగా ఎదురుచూస్తున్నారు. తమకు చాన్స్ ఇవ్వాలని అధిష్టానాన్ని వేడుకునేందుకు సిద్ధమయ్యారు.సరిగ్గా ఇదే సమయంలో హరీశ్ రావుకు సిట్ నోటీసులు ఇవ్వడంతో అధిష్టానం దృష్టి మరలింది.కేసీఆర్ ఫాంహౌస్లోనే ఉండగా, హరీశ్ రావు విచారణలకు హాజరవుతున్నారు. మరోవైపు కేటీఆర్ సైతం ఆయనకు సంఘీభావంగా ఆయన వెంటే ఉంటున్నారు.రాష్ట్ర నాయకత్వం మొత్తం ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ టెన్షన్లో ఉండటంతో ఏం చేయాలో తోచని స్థితిలో కేడర్ ఉన్నట్టు తెలుస్తున్నది. కావాలనే రేవంత్ సర్కార్ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నదని ఆరోపిస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఏ క్షణమైనా విడుదల అవ్వొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్నారు.ఆయన రాగానే ఎన్నికల నిర్వహణపై క్లారిటీ రానుంది. ప్రభుత్వం ఓకే అనగానే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దాంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. అయితే, నేటివరకు మున్సిపల ఎన్నికల సన్నద్ధతపై గులాబీ పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.వార్డులు, కార్పొరేషన్ల వారీగా ఇన్చార్జుల నియామకం చేపట్టలేదు. ఆశావహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించలేదు. వాటిని ఫైనల్ చేసే ప్రక్రియను ఎవరు చూడనున్నారు? స్థానికంగా ఎన్నికల ప్రచార బాధ్యతలను ఎవరికి అప్పగించనున్నారు? గెలుపు బాధ్యతను ఎవరు తీసుకోనున్నారు? ఇటువంటి విషయాలపై ఇంకా క్లారిటీ లేకపోవడంతో గులాబీ కేడర్ తీవ్రనిరాశలో ఉన్నట్టు తెలుస్తున్నది. ఈసారి ఎన్నికల్లో గులాబీ పార్టీ సత్తా చాటాలనే ఆశయానికి కాంగ్రెస్ పార్టీ గండి కొట్టిందని చర్చ జరుగుతున్నది.