Khairatabad Bypoll: తెలంగాణలో మరో ఉప ఎన్నిక కోసం బీఆర్ఎస్ ఫోకస్ చేసిందా? జూబ్లీహిల్స్ షాక్ నుంచి ఇప్పుడిప్పుడే ఆ పార్టీ తేరుకుంటోందా? ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయమని జోరుగా చర్చ జరుగుతోందా? కారు పార్టీ ఇప్పటికే అభ్యర్థిని రెడీ చేసిందా? ఇద్దరు నేతలను లైన్లో పెట్టిందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
ఖైరతాబాద్ ఉపఎన్నిక ఖాయం?
తెలంగాణలో మరో ఉప ఎన్నిక జరగడానికి అవకాశం ఉన్న నియోజకవర్గం ఖైరతాబాద్. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున దానం నాగేందర్ విజయం సాధించారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ వైపు వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు.
బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, ఆ పార్టీకి రాజీనామా చేయకుండా మరో పార్టీ తరపున పోటీ చేయడమే అందుకు కారణం. ఫిరాయింపు చట్టం ప్రకారం ఆయనపై అనర్హత వేటు పడే అవకాశముందని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఆయన కోల్పోతారని అంటున్నారు. స్పీకర్ నిర్ణయం కంటే ముందు ఆయన తన రాజీనామాపై నిర్ణయం తీసుకోవచ్చని అనుకుంటున్నారు.
అభ్యర్థి కోసం బీఆర్ఎస్ వెతుకులాట
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకోలేదంటూ బీఆర్ఎస్ ధిక్కార పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సోమవారం సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. నాలుగు వారాల్లో తేల్చాలని తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్కు నోటీసులు ఇచ్చింది. మరో నాలుగు వారాల్లో 10 మంది ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు.
మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి పక్కనపెడితే, అంతకుముందే రాజీనామా చేసేందుకు దానం రెడీ అవుతున్నట్లు సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇటీవల బెంగాల్ టీఎంసీ నేత ముకుల్రాయ్ సభ్యత్వాన్ని హైకోర్టు రద్దు చేసింది. బీజేపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, ఆ తర్వాత టీఎంసీ వైపు వెళ్లారు. దీన్ని సవాల్ చేస్తూ బీజేపీ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆయనపై హైకోర్టు అనర్హత వేటు పడింది.
ALSO READ: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. వాట్సాప్ ద్వారా సర్టిఫికెట్లు జారీ
ఇప్పటికే కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ బైపోల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ, ఖైరతాబాద్ ఉప ఎన్నిక వస్తే.. విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని ఆలోచన చేస్తోందట. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు, పార్టీ హైకమాండ్ తో చర్చించినట్టు తెలుస్తోంది. ఎలాగున్నా ఖైరతాబాద్ బైపోల్ రావడం ఖాయమని అంటున్నారు.
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న బీఆర్ఎస్.. ఖైరతాబాద్పై ఇప్పటి నుంచి దృష్టి పెట్టింది. గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన విష్ణువర్థన్ రెడ్డి వైపు గులాబీ హైకమాండ్ మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. తొలుత జూబ్లీహిల్స్ బైపోల్ లో విష్ణు పోటీ చేయాల్సి ఉండగా, ఈ విషయమై మాట్లాడిన తర్వాత ఆయన వెనక్కి తగ్గారని గులాబీ కేడర్ మాట.
ఖైరతాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున దానం బలమైన నేత. ఆయన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు బలమైన నేతకు టికెట్ ఇవ్వాలని భావిస్తోందట బీఆర్ఎస్. పీజేఆర్ కొడుకు విష్ణు టికెట్ దక్కవచ్చని అంటున్నారు. గత ఎన్నికల వరకు విష్ణు కాంగ్రెస్లో ఉన్నా, చివరి నిమిషంలో బీఆర్ఎస్ గూటికి చేరారు. ఆ పార్టీ తరపున టికెట్ ఆశించి భంగపడ్డారు.
ఇప్పుడు విష్ణుకు టికెట్ ఇవ్వాలని భావిస్తోందట కారు పార్టీ హైకమాండ్. విష్ణుతోపాటు బలమైన మరో వ్యక్తిని బీఆర్ఎస్ లైన్లో పెట్టినట్టు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ఖైరతాబాద్ నియోజకవర్గానికి బైపోల్ రావడం ఖాయమనే చర్చ అప్పుడే నేతల్లో జోరుగా సాగుతోంది.