రాష్ట్రంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ విభజన రాజకీయాలకు తెరలేపినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని గుర్తించిన అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీ మాయలో ప్రజలు పడరాదని అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. పదేండ్లు అధికారంలో బీఆర్ఎస్ పార్టీకి అధికార దాహం ఇంకా తీరలేదని, అందుకే సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టి ఆ తర్వాత రాజకీయంగా వారిని తమవైపునకు తిప్పుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అందుకే ప్రభుత్వం ఏ పని తలపెట్టిన కులాలు, మతాల వారీగా విడివిడిగా చూపిస్తూ వారికి చేశారు సరే.. మరి వీరికి ఎందుకు చేయలేకపోయారు? అంటూ మనుషులు, వర్గాల మధ్య విభజన తీసుకువచ్చేందుకు కారు పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టు కాంగ్రెస్ ఆరోపిస్తున్నది.
గతంలో కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలిచిన వర్గాలపైనే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. వారంతా గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిన స్కీమ్స్కు మద్దతు పలికారు. ఇప్పుడు వారికి ఆరు గ్యారంటీలు అమలు కావడం లేదని నమ్మించడమే కాకుండా ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని వివరించి తమ వైపునకు తిప్పుకోవాలని గులాబీ నేతలు భావిస్తున్నట్టు సమాచారం. అందుకే ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో జరిగిన సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లోనూ గులాబీ సీనియర్లు ఇదే ఫార్ములాను ఫాలో అయినట్టు తెలుస్తోంది. ముందుగా ఓటరు శాతాన్ని పెంచుకుని ఆ తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం.
రేవంత్ సర్కార్ అభివృద్ధి పేరిట భారీ ఎత్తున కుంభకోణాలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ సీనియర్లు హరీశ్ రావు, కేటీఆర్ పదే పదే ఆరోపిస్తున్నారు. గత బీఆర్ఎస్ హయాంలో జీఎస్డీపీ వృద్ధిరేటులో తెలంగాణ నెంబర్ 1గా ఉండేదని, జీఎస్టీ వసూళ్లు సైతం భారీగా పెరిగాయని, ఉద్యోగ కల్పన కూడా పెద్దమొత్తంలో జరిగిందని పేర్కొంటున్నారు. కాంగ్రెస్ సర్కారు వచ్చిన రెండున్నరేండ్లలోనే అభివృద్ధి, పెట్టుబడులు మందగించాయని..కానీ, ఆర్ ఆర్ టాక్స్ పేరిట రియల్టర్లు, కంపెనీల నుంచి పెద్దమొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అక్రమ మైనింగ్ పెరిగిందని, మూసీ పేరిట రూ.లక్ష కోట్ల దోపిడీకి రేవంత్ సర్కార్ తెరలేపిందని ఆరోపిస్తున్నారు.
Congress : మంత్రుల మధ్య విబేధాలు.. ప్రతిపక్షాలకు షాక్!
ఇలా సర్కారు మీద వ్యతిరేకత తీసుకొచ్చేందుకు రిటైర్ట్ ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, కులాల వారీగా ప్రజలను రెచ్చగొట్టేందుకు కారుపార్టీ ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు మంత్రుల మధ్య విబేధాలు ఉన్నాయని.. పాలన సరిగా సాగడం లేదని, ఖజానాను కొల్లగొడుతున్నారని.. సంక్షేమం సజావుగా ముందుకు సాగడం లేదని.. విద్యుత్ చార్జీలు పెంచి ప్రజల మీద భారం వేయాలని కాంగ్రెస్ సర్కారు చూస్తోందని ప్రజలను రెచ్చగొట్టేందుకు బీఆర్ఎస్ పెద్ద పన్నాగమే పన్నినట్టు చర్చ జరుగుతున్నది. ఈ విషయాన్ని ముందే గుర్తించిన కాంగ్రెస్ నేతలు, సోషల్ మీడియా వింగ్.. ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తున్నది. ఎన్నికలకు ఇంకా రెండేండ్లు ఉన్నా .. ఇప్పటి నుంచి బీఆర్ఎస్ చేస్తున్న కుటిల ప్రయత్నాలను తిప్పికొట్టాలని వారు ప్రజలను కోరుతున్నారు.