Hyderabad: అసెంబ్లీ సాక్షిగా జరిగిన ఘటనను బ్లాక్ డే గా వర్ణించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత. ఇలాంటి ఘటన ఎక్కడ జరగలేదని తాను భావిస్తున్నానని, అసెంబ్లీ ఎదుట దుశ్శాసన పర్వంగా వర్ణించారు. ఇది ముమ్మాటికీ రాజ్యాంగాన్ని ఖూనీ చేయడమేనని అన్నారు.
మహిళా ఎమ్మెల్యేలు అని చూడకుండా పోలీసులు మా చీరలు లాగుతారా? మహిళలను అవమానించడమే ఇందిరమ్మ రాజ్యమా? అంటూ ప్రశ్నలు లేవనెత్తారు. తాము ఏం తప్పు చేశాం? కనీసం మహిళా ఎమ్మెల్యేలమని చూడకుండా చేసిన ఘటన ఏంటని ప్రశ్నించారు. మేం ఏం పాపం చేశాం? ప్రజల పక్షాన మాట్లాడడమే మేం చేసిన తప్పా? అంటూ మండిపడ్డారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందు బీఆర్ఎస్ సభ్యులు బ్లాక్ టీ షర్టు ధరించారు. ఆ టీ షర్టు వెనుక ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాతలు ఉన్నాయి. అంతేకాదు ప్లకార్డులు చేతబట్టి నిరసనలు చేస్తూ సభకు వస్తున్నారు. దీన్ని గమనించిన పోలీసులు, సభ్యులు ఆపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు-బీఆర్ఎస్ శాసనసభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
ఈ క్రమంలో పలువురు ఎమ్మెల్యేలు స్పృహ తప్పి కిందపడిపోయారు. ఏం జరిగిందో తెలీదుగానీ ఎమ్మెల్యే చీర లాగడంతో ఆమె ఒక్కసారిగా షాకయ్యారు. తోటి సభ్యురాలు అక్కడి సబిత ఇంద్రారెడ్డి వచ్చారు. జరిగిన ఘటనతో ఎమ్మెల్యే సునీత షాకై, కంటతడి పెట్టారు. మహిళా ఎమ్మెల్యేలమని చూడకుండా జుట్టు పట్టుకొని దారుణంగా పోలీసులు ఈడ్చుకెళ్లారని ఆరోపించారు మరొక ఎమ్మెల్యే సబిత. కాంగ్రెస్ సర్కార్ మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా?
మహిళలకు రక్షణ ఉందని, వారిని కోటీశ్వరులను చేస్తామని చెబుతున్న ప్రభుత్వం ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన తర్వాత మీడియా ముందుకొచ్చిన ఆమె, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇందిరమ్మ రాజ్యమంటే ఇదేనా అంటూ రుసరుసలాడారు. మాకు జరిగిన అవమానంపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళా సమాజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు.
ALSO READ: తెలంగాణ అసెంబ్లీ వద్ద హైడ్రామా.. నిరసనలు, ప్లకార్డులతో.. కేటీఆర్కు గాయాలు- సునీత కన్నీరు