Telangana Politics: తెలంగాణలో బీఆర్ఎస్ రాజకీయ పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సిద్ధమైంది. ఈసారి వేడుకలను అట్టహాసంగా చేయాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. హైదరాబాద్లోని పార్టీ ప్రధాన ఆఫీసు తెలంగాణ భవన్ గులాబీ తోరణాలతో అందంగా ముస్తాబైంది. పాతికేళ్ల మాట ఒక లెక్క.. ఇకపై ఆ పార్టీ మరొక లెక్కని అంటున్నారు ఆ పార్టీ నేతలు.
బీఆర్ఎస్ పార్టీ పాతికేళ్ల ప్రస్థానం
బీఆర్ఎస్ పార్టీ పాతికేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో వేడుకలు భారీ ఎత్తున చేయాలని రెడీ అయ్యింది. అందుకు సంబంధించి ఏర్పాట్లు చేసింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అధినేత కేసీఆర్, మధ్యాహ్నం పార్టీ ఆఫీసు తెలంగాణ భవన్కు రానున్నారు.
ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, జిల్లాల అధ్యక్షులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాలు, పార్టీ నిర్ణయాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
పాతికేళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న వేళ సంస్థాగతంగా పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే దానిపై రోడ్ మ్యాప్ ఇచ్చే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో చేపట్టబోయే ఉద్యమ ప్రణాళికను ఈ సమావేశంలో కేసీఆర్ ఖరారు చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతకుముందు అమర వీరులకు నివాళులర్పించి పార్టీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ ప్రసంగించనున్నారు.
రానున్న రోజుల్లో కారు పార్టీకి అనేక సవాళ్లు
పార్టీ ఆఫీసు ముందు జెండాను ఎగురువేశారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, పాతికేళ్ల కిందట ఇదే రోజు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందన్నారు. 14 ఏళ్లు తెలంగాణ ప్రజలను, జాతిని ఐక్యం చేసి ఢిల్లీ మెడలు వంచామన్నారు. ప్రజలు ఆశీర్వదించి అధికారమిస్తే కేసీఆర్ పదేళ్లు రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రభాగాన నిలబెట్టారని గుర్తు చేశారు. 14 ఏళ్లు ఉద్యమ పార్టీగా, తర్వాత 10 ఏళ్లు అధికార పార్టీగా ఆ తర్వాత ప్రతిపక్ష పాత్రను బీఆర్ఎస్ సమర్థవంతంగా పోషిస్తుందన్నారు.
కీలక నేతల పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ఎక్స్ వేదికగా కొన్ని అంశాలు రాసుకొచ్చారు. నాలుగు కోట్ల గొంతులను ఏకం చేసి విప్లవ శంఖం మోగించిన ధిక్కార వేదిక అంటూ ప్రస్తావించారు.
సమైక్య సంకెళ్లను తెంచి స్వరాష్ట్ర కాంక్షను సాకారం చేసిన యుద్ధ గీతిక, పదేళ్ల పాలనతో ఉద్యమ తెలంగాణను ఉజ్వల తెలంగాణగా తీర్చిదిద్దిన అభివృద్ధి పతాక అంటూ రాసుకొచ్చారు. తెలంగాణ జాతి ఆత్మగౌరవ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గులాబీ దీపిక, ప్రజల విశ్వాసానికి ప్రతీక, ప్రజా ఉద్యమ పతాక.. భారత రాష్ట్ర సమితి 26 వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చారు.
ALSO READ: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఇంధన కష్టాలు.. ఏపీ- తెలంగాణలో కొరత, కొత్త నిబంధనలు పెడుతున్న బంకులు
ఉద్యమంలోనైనా, అధికారంలోనైనా, ప్రతిపక్షంలోనైనా ఎప్పుడూ ప్రజల పక్షానే నిలబడి, తెలంగాణను కంటికి రెప్పలా కాపాడుకున్న పార్టీ అని పేర్కొన్నారు. పోరాటాల పునాది మీద పుట్టి, ప్రజల విశ్వాసంతో ఎదిగి, ప్రతి గుండెలో నాటుకుపోయిన గులాబీ శక్తి మన బీఆర్ఎస్ అని పేర్కొన్నారు. గులాబీ జెండా సగర్వంగా ఎగిరే రోజు ఎంతో దూరంలో లేదన్నారు.
ఇది నాణెనికి ఒకవైపు.. మరోవైపు వద్దాం. ఆ పార్టీలో సమస్యలు లేకపోలేదు. అధికార పోయిన తర్వాత నేతలు వాయిస్ బలంగా వినబడలేదు. ఎవరు, ఎప్పుడు ఏ పార్టీలోకి జంప్ అవుతారో తెలియని పరిస్థితి. దీనికితోడు కవిత సొంత పార్టీ పెట్టడం, ఆమె వైపు ఎంతమంది నాయకులు వెళ్తారోనన్న టెన్షన్ ఆ పార్టీ నాయకత్వాన్ని వెంటాడుతోందని ప్రత్యర్థుల నుంచి సౌండ్ బలంగా వినిస్తోంది.