తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ క్రమంగా తన ఉనికిని కోల్పోతున్నట్లు తాజా రాజకీయ పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.దీంతో గులాబీ కేడర్ క్రమంగా డీలా పడుతున్నట్లు తెలుస్తున్నది. ఇప్పుడున్న నాయకత్వం కేడర్కు, తెలంగాణ ఉద్యమకారులకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని కిందిస్థాయి నేతల్లో చర్చ జరుగుతున్నది.సరైన మార్గనిర్దేశం లేక నేతలు సైతం యాక్టివ్ పాలిటిక్స్కు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తున్నది. చాలా కాలంగా పార్టీలో కమిటీలు వేయలేదు. కొత్తవారికి అవకాశం ఇవ్వలేదు. దీంతో పాత లీడర్ల డామినేషన్ ఎక్కువైంది. వారు తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని కింది స్థాయి నేతలు ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఇటువంటి సమయంలో గులాబీ బాస్ కేసీఆర్.. వస్తేనే పార్టీకి బతుకుదెరువు ఉంటుందని లేదంటే ఇతర పార్టీలోకి వలసలు తప్పవని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
గత సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి అనంతరం కేసీఆర్ క్రియాశీలక రాజకీయాలకు దూరం అయ్యారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా, ఎమ్మెల్యేగా ప్రమాణం చేయడానికి , ఆ తర్వాత రెండు సార్లు అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజు హాజరై ఆ తర్వాత మళ్లీ ఇంటికే పరిమితం అయ్యారు.కాళేశ్వరం ప్రాజెక్టు మీద చర్చకు సైతం ఆయన రాలేదు. అయితే, ఆయనకు ఆరోగ్యం బాగోవడం లేదని అందుకే అసెంబ్లీ సమావేశాలు, బీఆర్ఎస్ భవన్కు రావడం లేదని గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే, రేవంత్ చేతిలో ఓటమిని జీర్ణించుకోలేకే కేసీఆర్ బయటకు రావడం లేదని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
2023 డిసెంబర్లో అధికారానికి దూరమైన బీఆర్ఎస్.. అప్పటి నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ఓటమిని చవిచూస్తూ వచ్చింది. ముందుగా దివంగత కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత ప్రమాదంలో మరణించడంతో సిట్టింగ్ స్థానానికి జరిగిన బైపోల్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేశ్ గెలుపొందారు. ఇటీవల జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో జరిగిన బైపోల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచారు. రెండు సిట్టింగ్ స్థానాలను బీఆర్ఎస్ కోల్పోయింది. అంతకుముందు ఆ పార్టీ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీ పంచన చేరారు.తాజాగా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో గులాబీ పార్టీ దారుణ ఓటమిని చవిచూసింది. ఏకంగా 70 శాతం సీట్లను కోల్పోయినట్లు పార్టీలో జోరుగా చర్చ జరుగుతున్నది. కేసీఆర్ బయటకు రాకపోవడంతో కేటీఆర్, హరీశ్ రావులు అన్నీ తానై పార్టీ వ్యవహారాలను చక్కబెడుతున్నారు. అయినప్పటికీ వీరి సారథ్యంలో పార్టీకి ఓటములు తప్పడం లేదు.
బీఆర్ఎస్ పార్టీకి కల్వకుంట్ల కవిత ప్రస్తుతం తలనొప్పిగా మారారు. పార్టీ నుంచి బయటకు వచ్చిన ఆమె గులాబీ పార్టీ సీనియర్ నేతలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఫలితంగా అది అధికార కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతోంది. గత పదేండ్లలో బీఆర్ఎస్ పార్టీలో జరిగిన అవకతవకలు, అవినీతి అంశాలను ఆమె టార్గెట్ చేస్తున్నారు. దీంతో ప్రజలు గులాబీ పార్టీకి క్రమంగా దూరం అవుతున్నట్లు తెలుస్తున్నది. ఇన్ని గందరగోళాల నడుమ జరుగుతున్న ఎన్నికల్లో పార్టీకి వరుస ఓటములు తప్పడం లేదు. దీంతో కేడర్ సైతం డీలా పడిపోతున్నట్లు తెలుస్తున్నది. మరల పార్టీకి జవసత్వాలు నింపాలన్నా.. మునుపటి ఉద్యమ స్ఫూర్తిని రగలించి రాబోయే స్థానిక ఎన్నికలు..జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటాలంటే గులాబీ బాస్ బయటకు రావాలని.. అప్పుడే రాష్ట్ర రాజకీయాల్లో తలెత్తుకుని తిరగగలమని కేడర్, గులాబీ నేతలు కోరుతున్నారు. కాగా, రేపు కేసీఆర్ తెలంగాణ భవన్కు వెళ్లనున్నారు. పార్టీ నేతలకు దిశానిర్దేశం.. కృష్ణా జలాల్లో రాష్ట్రం వాటా.. ఏపీ జలదోపిడీ.. కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహర శైలిపై ఆయన మీడియాతో మాట్లాడుతారని సమాచారం.