Air India Flight Emergency Landing: ఎయిర్ ఇండియాలో ప్రయాణం అంటేనే ప్యాసింజర్లు భయంతో వణికిపోతున్నారు. ముఖ్యంగా అహ్మదాబాద్ దుర్ఘటన తర్వాత ఆ సంస్థకు చెందిన విమానాలు ఎక్కాలంటేనే జంకుతున్నారు. తాజాగా జెడ్డా నుంచి కోజికోడ్ వెళ్తున్న విమానంలోని ప్రయాణీకులు ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరికి కొచ్చి విమానాశ్రయంలో విమానం ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
సౌదీ అరేబియాలోని జెడ్డా నుంచి 160 మంది ప్రయాణికులతో కోజికోడ్ కు బయల్దేరింది. IX 398 విమానం ఉదయం 9.07 గంటలకు కొచి విమానాశ్రయంలో ఎమర్జెన్సీగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. నిజానికి జెడ్డా విమానాశ్రయం నుంచి బయల్దేరిన సమయంలో రన్ వే మీద ఉన్న పదునైన వస్తువుల కారణంగా విమానం టైర్ దెబ్బతిన్నది. టేకాఫ్ అయిన కాసేపటికి పైలెట్ కు విషయం తెలిసింది. ఇండియాలోకి ఎంటర్ అయిన తర్వాత ప్రధాన ల్యాండింగ్ గేర్ లో కూడా సమస్య ఏర్పడింది. ఓ వైపు టైర్ సమస్య, మరోవైపు సాంకేతిక లోపాన్ని పైలెట్ గుర్తించాడు. వెంటనే కోజికోడ్ వెళ్లాల్సిన విమానాన్ని కొచ్చి వైపు తీసుకెళ్లాడు. ఏటీసీ అధికారులకు సమాచారం అందించాడు. వారి సూచనల మేరకు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. ల్యాండింగ్ సమయంలోనే కుడి వైపున ఉన్న రెండు టైర్లు పగిలిపోయాయి. అయినప్పటికీ, చాకచక్యంగా పైలెట్ సేఫ్ గా ల్యాండ్ చేశాడు. ఈ ఘటనలో ప్రయాణీకులకు ఎలాంటి అపాయం జరగలేదు.
విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు సంబంధించి ఎయిర్ ఇండియా స్పందించింది. “జెడ్డా విమానాశ్రయంలో రన్వేపై ఉన్న పదునైన వస్తువు వల్ల విమానం టైర్ దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలో జెడ్డా-కోజికోడ్ విమానాన్ని కొచ్చికి మళ్లించి, ముందు జాగ్రత్త చర్యగా ల్యాండ్ చేశారు. విమానం కొచ్చిలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రయాణీకులను రోడ్డు మార్గం ద్వారా కోజికోడ్కు తరలిస్తున్నాం. లిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము. ప్యాసింజర్స్ భద్రతే లక్ష్యంగా కీలక చర్యలు చేపడుతున్నాం” అని ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ప్రతినిధి తెలిపారు.
Read Also: ఇతడు 1998 నుంచి నడుస్తూనే ఉన్నాడు.. 2026 నాటికి ఇంటికి చేరే ఛాన్స్, ఎందుకలా?
ఎయిర్ ఇండియా విమానం కొచ్చి విమానాశ్రయంలో సజావుగా ల్యాండింగ్కు వీలుగా ఎయిర్ పోర్ట్ అధికారులు అత్యవసర జాగ్రత్తలను ముందుగానే ఏర్పాటు చేశారు. ఆ విమానం ల్యాండ్ అయిన తర్వాత రన్ వేను కొద్దిసేపు మూసివేశారు. అదే సమయంలో కొలంబో నుంచి కొచ్చికి వెళ్లే శ్రీలంక ఎయిర్లైన్స్ విమానం, UL165 మధురైకి డైవర్ట్ చేశారు. ఉదయం 9.20 గంటలకు కొచ్చి విమానాశ్రయంలో విమానం దిగాల్సి ఉంది. తనిఖీ తర్వాత రన్వేను మళ్లీ ఓపెన్ చేశారు. ఈ ఘటనలో ప్రయాణీకులకు ఎలాంటి అపాయం జరగకపోవడంతో అంతా రిలాక్స్ అయ్యారు.
Read Also: హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు వందే భారత్, గరీబ్ రథ్లు నడపండి ప్లీజ్!