BRS Women MLAs: శాసనసభ నుంచి సస్పెండ్ కు గురైన అనంతరం బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, కోవా లక్ష్మి, సునిత లక్ష్మారెడ్డి అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక ప్రశ్నలను వారు లేవనెత్తారు. రెండ్రోజుల నుంచి స్పీకర్, ఆయన తల్లి గురించే మాట్లాడారని పేర్కొన్నారు. కానీ తమకు తగిలిన దెబ్బలు, గాయాల గురించి మాట్లాడలేదని వాపోయారు. తాము మాట్లాడాలని చూసినప్పుడు.. డ్రామా ఆడుతున్నారని అంటే ఎంతో బాధ అనిపించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అసెంబ్లీ ఎదుట చోటుచేసుకున్న ఉద్రిక్తతల్లో మగ పోలీసులు వచ్చి ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలను తోసేశారని చిట్ చాట్ లో ఓ నేత ఆరోపించారు. ఈ క్రమంలో సునితా లక్ష్మారెడ్డి కిందపడి పోయారన్నారు. ఒకవేళ తమ పార్టీ నేతలు సుధీర్ రెడ్డి, నవీన్ రెడ్డి వెనుక గానీ లేకుంటే నేలపై పడేవాళ్లమని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ శిఖండి రాజకీయాలు చేస్తోందని.. మహిళా కానిస్టేబుళ్లను ఎందుకు మగవారి మధ్య ఉంచారని ప్రశ్నించారు. లేడీ కానిస్టేబుల్స్ ను ముందు పెట్టి బట్టలు మార్చుకోమంటే ఎలా అని నిలదీశారు. తమకు ఆత్మగౌరవం లేదా అంటూ బీఆర్ఎస్ మహిళా నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
తమ మీద దాడి జరిగిన సమాచారం ఎందుకు బయటకు రానివ్వలేదని బీఆర్ఎస్ మహిళా నేతలు ప్రశ్నించారు. ‘మాకు కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వాలి కదా. ఆ ఘటనపై హోంమంత్రి గా ఉన్న సీఎం సభలో ప్రకటన విడుదల చేయాలి. కిందపడిపోయిన మమ్మల్ని తొక్కారు. స్పీకర్ ను మేం ఏమి అనలేదని మా ఎమ్మెల్సీలు చెప్పారు. అయినా క్షమాపణలు కోరారు. అయినప్పటికీ సస్పెండ్ చేశారు’ అని పేర్కొన్నారు.
Also Read: అసెంబ్లీలో సంచలనం.. కేటీఆర్, హరీశ్రావు సహా.. 18 మంది BRS ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు!
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ అనంతరం.. స్పీకర్ తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే తమకు అవకాశం ఇవ్వలేదని వాపోయారు. ఇప్పుడు మీడియాతో కూడా మాట్లాడనివ్వరా? అంటూ చీఫ్ మార్షల్ ను బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. మరోవైపు కేసీఆర్ చావాలని కోరుకున్న ఎమ్మెల్యేను ఎందుకు సస్పెండ్ చేయలేదని ఈ సందర్భంగా నిలదీశారు.
Also Read: వందేమాతరంపై మరో వివాదం.. ఈసారి మిత్రపక్షంతో కాంగ్రెస్కు పేచి.. విరుచుకుపడ్డ బీజేపీ!