Kinetic Electric Scooters Get Bigger Batteries: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసే సమయంలో చాలామంది ముందుగా చూసేది రేంజ్. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎంత దూరం ప్రయాణించవచ్చన్నది వినియోగదారులకు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో కైనెటిక్ తన DX ఎలక్ట్రిక్ స్కూటర్ లైనప్ లో కొత్త బ్యాటరీ ఆప్షన్లను తీసుకొచ్చింది. DX, DX+ మోడళ్లకు పెద్ద బ్యాటరీలను అమర్చి రేంజ్ను పెంచింది.
ఇప్పటివరకు DX సిరీస్లో 2.6kWh బ్యాటరీతో కూడిన మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. తాజాగా కంపెనీ DXకు 3kWh బ్యాటరీని, DX+కు 3.1kWh బ్యాటరీని పరిచయం చేసింది. ఈ కొత్త వేరియంట్లు పాత మోడళ్లకు కాకుండా.. 2.6kWh వెర్షన్లతో పాటు వీటిని కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కొత్త DX 3kWh ధరను రూ.1.19 లక్షలుగా నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న DX 2.6kWh ధర రూ.1.11 లక్షలుగా ఉంది. మరోవైపు DX+ 3.1kWh ధర రూ.1.28 లక్షలుగా ఉంది.
కొత్త బ్యాటరీతో వచ్చిన DX+ ప్రత్యేకంగా ఎక్కువ రేంజ్పై దృష్టి పెట్టింది. ఈ వేరియంట్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 132 కి.మీ IDC రేంజ్ అందిస్తుంది. ప్రస్తుత DX+ 2.6kWh మోడల్ 105 కి.మీ IDC రేంజ్ను కలిగి ఉంది. అయితే, రోజువారీ రోడ్లపై వాస్తవ వినియోగంలో రేంజ్ కొంత తక్కువగా ఉండొచ్చు. సాధారణ పరిస్థితుల్లో కొత్త DX+ 3.1kWh సుమారు 105 నుంచి 110 కి.మీ వరకు ప్రయాణించగలదని కైనెటిక్ అంచనా వేస్తోంది.
పెద్ద బ్యాటరీతో పాటు కొత్త DX+లో మోటార్ విషయంలోనూ మార్పు చేశారు. ప్రస్తుత DX+లో ఉన్న సుమారు 4.78kW మోటార్ స్థానంలో కొత్త మోడల్లో 3.8kW హబ్ మౌంటెడ్ మోటార్ను ఉపయోగించారు. రేంజ్ను పెంచడమే లక్ష్యంగా ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది. కొత్త DX+లో టర్బో రైడింగ్ మోడ్ ను తొలగించారు. బదులుగా రేంజ్, పవర్ అనే రెండు రైడింగ్ మోడ్లు కొనసాగుతాయి. అంటే ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునే వారికి రేంజ్ మోడ్ ఉపయోగపడేలా సెటప్ చేశారు.
DX 3kWh వేరియంట్ను కూడా కంపెనీ కొత్తగా లైనప్లో చేర్చింది. దీని ధర రూ.1.19 లక్షలు. అయితే ఈ మోడల్కు సంబంధించిన రేంజ్, మోటార్ అవుట్పుట్ వంటి పూర్తి వివరాలను కైనెటిక్ ఇంకా వెల్లడించలేదు. ఇది పాత DX 2.6kWh స్థానంలో వచ్చిన మోడల్ కాదు. రెండు బ్యాటరీ సామర్థ్యాలతో కూడిన వెర్షన్లు ప్రస్తుతం అందుబాటులో ఉంటాయి. దీంతో వినియోగదారులు తమ ప్రయాణ అవసరాలకు తగ్గట్టుగా వేరియంట్ను ఎంచుకునే అవకాశం ఉంటుంది.
కైనెటిక్ DXను భారత్లో మాత్రమే కాకుండా విదేశీ మార్కెట్లలోనూ తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించింది. టర్కీ, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, కెన్యా, నైజీరియా, ఈజిప్ట్ వంటి దేశాలను కంపెనీ పరిశీలిస్తోంది.
Read Also: సింపుల్ ఎనర్జీ సూపర్ జోష్.. ఏడాదిలో 10 వేలకుపైగా ఈవీ స్కూటర్ల సేల్!