ACB Arrests: అధికారికంగా సహాయం చేసేందుకు లంచం తీసుకున్న సబ్ రిజిస్ట్రార్ తోపాటు అతనికి సహకరించిన ప్రైవేట్ వ్యక్తిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణపేట జిల్లా సబ్ రిజిస్ట్రార్ గా లగిశెట్టి వెంకట స్వామి పని చేస్తున్నాడు. కాగా, ఇటీవల ఓ వ్యక్తి తన ఇంటి రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోగా 90వేలు లంచంగా డిమాండ్ చేశాడు. 50వేల రూపాయలు తీసుకున్నాడు కూడా. మిగితా 40వేల రూపాయలను తనకు ఏజెంట్ గా వ్యవహరిస్తున్న మన ఇంటి భోజనం మెస్ యజమాని కమ్మరి నాగేశ్ కు ఇవ్వాలని సూచించాడు. ఈ మేరకు దరఖాస్తుదారు మంగళవారం 40వేల రూపాయలను నాగేశ్ కు ఇస్తుండగా ముందస్తు సమాచారం మేరకు మాటు వేసిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. విచారణలో అతను వెల్లడించిన వివరాలతో వెంకట స్వామిని కూడా అరెస్ట్ చేసి ఇద్దరిపై కేసులు నమోదు చేశారు.
Also read: ఖరీదైన గ్యాడ్జెట్లు అక్కర్లేదు.. 3D ప్రింటర్తో మీ హోమ్ థియేటర్ను ఇలా అప్గ్రేడ్ చేసుకోండి!
క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు లంచం తీసుకున్న మరో అధికారిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ముషీరాబాద్ లోని క్వాలిటీ కంట్రోల్ సెల్ లో సాయి రాం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. ఓ కాంట్రాక్టర్ పూర్తి చేసిన పనికి క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు 10వేల రూపాయలు డిమాండ్ చేశాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు వలపన్ని మంగళవారం సాయి రాం లంచం డబ్బు తీసుకోగానే దాడి చేసి పట్టుకుని కేసులు నమోదు చేశారు.
Also Read: ఇబ్రహీంపట్నం స్టేషన్లో రమా నందనా విచారణ.. ఏం జరిగిందంటే?