Vande Mataram Row: శ్రీనగర్లో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో వందేమాతరం గీతాన్ని పూర్తిస్థాయిలో ఆలపించడం రాజకీయ రగడకు దారి తీసింది. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, నేషనల్ కాన్ఫరెన్స్ (NC) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా సమక్షంలో వందేమాతరం పూర్తి వర్షన్ను ఆలపించడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం వివాదానికి కారణమైంది. దీంతో మిత్రపక్షాలైన కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య విభేదాలు బయటపడటమే కాకుండా బీజేపీ కూడా రంగంలోకి దిగడంతో ఈ వ్యవహారం రాజకీయ తుఫానుగా మారింది.
ఈ వివాదంపై కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. జాతీయ గేయం మొదటి రెండు చరణాలను మాత్రమే పాడే సంప్రదాయాన్ని పాటించాలని మిత్రపక్షం నేషనల్ కాన్ఫరెన్స్కు సూచించారు. పూర్తి వందేమాతరం మన దేశ లౌకిక, బహుళత్వ భావనకు భిన్నంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మహాత్మా గాంధీ, పండిట్ నెహ్రూ, సర్దార్ పటేల్, సుభాష్ చంద్రబోస్ వంటి ప్రముఖుల నిర్ణయాలను, రవీంద్రనాథ్ ఠాగూర్ సలహాలను గౌరవిస్తూ 1937 నాటి సీడబ్ల్యూసీ తీర్మానానికే కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఆర్ఎస్ఎస్ (నాగ్పూర్) ఒత్తిళ్లకు తలొగ్గొద్దని ఎన్సీ నేతలకు కాంగ్రెస్ సూచించింది.
కాంగ్రెస్ అభ్యంతరాలపై నేషనల్ కాన్ఫరెన్స్ నేత బషీర్ అహ్మద్ తీవ్రంగా స్పందించారు. కూటమి భాగస్వామిగా ఉన్నంత మాత్రాన కాంగ్రెస్ తమపై ఎలాంటి నిర్ణయాలను రుద్దలేదని తెగేసి చెప్పారు. ఎంతవరకు పాడాలి? ఏం పాడాలి? అనేది ప్రజల వ్యక్తిగత ఎంపిక అని ఎవరిపైనా దేన్నీ బలవంతంగా రుద్దడాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
Also Read: మానవ వ్యర్థాలతో.. అత్యంత బలమైన కాంక్రీట్.. శాస్త్రవేత్తల నెవర్ బిఫోర్ ప్రయోగం!
మరోవైపు ఈ వివాదంపై బీజేపీ విరుచుకుపడింది. కాంగ్రెస్ పార్టీ శతాబ్దం క్రితం నాటి ముస్లిం లీగ్లా మారిపోయిందని బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది విమర్శించారు. కాంగ్రెస్ పూర్తిగా తీవ్రవాద, మౌలికవాద శక్తులకు లొంగిపోయిందని ఆరోపించారు. వందేమాతరం ఫుల్ వెర్షన్ అంశంలో ఆ పార్టీ ఒంటరిగా మిగిలిపోయిందని ఆరోపించారు. మరోవైపు కాశ్మీర్ లోయలోని వేర్పాటువాదులు సైతం ఎన్నడూ వందేమాతరంపై ఇలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని బీజేపీ నేత ఆర్.ఎస్. పఠానియా వ్యాఖ్యానించారు.
Also Read: జియో రూ.500 vs రూ.550 ప్లాన్స్.. ఉచిత ఓటీటీలు, అపరిమిత 5G.. యూజర్లకు పండగే!