Minority Study: స్వేచ్ఛ బ్యూరో: ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా సౌకర్యాలు, అవకాశాలను మైనారిటీ విద్యార్థులు సద్వినియోగం చేసుకుని, పట్టుదల, క్రమశిక్షణతో కష్టపడి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ పిలుపునిచ్చారు. సోమవారం ఇందిరా ప్రియదర్శిని జూనియర్ కళాశాల ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన‘ప్రభుత్వ మైనారిటీ స్టడీ సర్కిల్, కెరీర్ కౌన్సెలింగ్ సెంటర్ ను ఆయన అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి అజహరుద్దీన్ మాట్లాడుతూ.. నూతన కేంద్రం మైనారిటీ యువతకు అద్భుతమైన అవకాశమని పేర్కొన్నారు. కేంద్రం ఏర్పాటును వేగవంతం చేసిన మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులను, ముఖ్యంగా డైరెక్టర్ తారిఖ్ అన్వర్ను అభినందించారు.”ప్రపంచంలో ఏదీ ఉచితంగా రాదు. ప్రభుత్వం అన్ని సౌకర్యాలనూ కల్పించింది. విజయం సాధించాలంటే కష్టపడటమే దానికి చెల్లించాల్సిన మూల్యం. జీవితంలో ఏ లక్ష్యాన్ని ఎంచుకున్నా ప్యాషన్, పట్టుదల, అంకితభావం పెంచుకోవాలి” అని విద్యార్థులకు మంత్రి మార్గదర్శనం చేశారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మైనారిటీల విద్య, అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, అందరి సూచనలు స్వీకరించే స్పష్టమైన విజన్ ఉన్న నాయకుడని ప్రశంసించారు.
Also Read: స్పీకర్పై వ్యాఖ్యలు.. రాజకీయాల్లో కొత్త వివాదం..!
తానునేర్చుకోవడంలో ప్రశ్నించడం కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి అన్నారు. తన క్రికెట్ కెరీర్ ప్రారంభంలో సునీల్ గవాస్కర్ నుంచి తరచూ సందేహాలు అడిగి తెలుసుకునేవాడినని గుర్తు చేసుకున్నారు. అలాగే నిజాం కళాశాలలో చదివే రోజుల్లో పరిమిత సౌకర్యాలు ఉన్నప్పటికీ చెట్టు కింద కూర్చుని చదువుకున్న తన ఇద్దరు స్నేహితులు ఈనాడు ఉన్నత స్థానాల్లో ఉన్నారని, పరిస్థితులు ఎలా ఉన్నా పట్టుదల ఉంటే విజయం ఖాయమని స్పష్టం చేశారు. బాలికలు విద్య, ఉద్యోగాల్లో ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, బాలురు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.
Also read: మట్టి గణపయ్యను ఇంటికి తీసుకెళ్లండి.. హెచ్ఎండీఏ బంపర్ ఆఫర్