సంగారెడ్డి జిల్లాలో ఘోర ఘటన చోటుచేసుకుంది. కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తెల్లాపూర్లో తల్లీకొడుకులు దారుణ హత్యకు గురయ్యారు. జేపీ కాలనీలో నివసిస్తున్న చంద్రకళ (30), ఆమె ఎనిమిదేళ్ల కుమారుడు రోహిత్ ప్రాణాలు కోల్పోవడం ఆ ప్రాంతంలో విషాద ఛాయలు నింపింది.
పోలీసుల వివరాల ప్రకారం.. మృతురాలు చంద్రకళకు తన భర్తతో గత కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో భర్త ఆమెను వదిలిపెట్టడంతో.. మనస్తాపానికి గురైన చంద్రకళ కేవలం మూడు రోజుల క్రితమే తన కుమారుడు రోహిత్ను తీసుకుని తెల్లాపూర్లోని జేపీ కాలనీకి మకాం మార్చింది. కొత్త నివాసంలో స్థిరపడకముందే.. గుర్తుతెలియని వ్యక్తులు వీరిద్దరినీ అత్యంత దారుణంగా హతమార్చారు.
ఈ జంట హత్యల వెనుక అక్రమ సంబంధం కోణం ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చంద్రకళ వ్యక్తిగత జీవితం, ఆమె గత పరిచయాలు లేదా వివాహేతర సంబంధాలే ఈ ఘాతుకానికి దారితీసి ఉండవచ్చనే దిశగా దర్యాప్తు సాగుతోంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న కొల్లూరు పోలీసులు, మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. క్లూస్ టీమ్ ద్వారా కీలక ఆధారాలను సేకరిస్తున్నారు. అసలు హత్యకు గల కారణాలేమిటి..? దీని వెనుక ఎవరి హస్తం ఉంది..? భర్తతో ఉన్న గొడవలే కారణమా లేక మరేదైనా వివాదం ఉందా..? అనే పూర్తి వివరాలు విచారణలో తేలాల్సి ఉంది. పట్టపగలే ఇలాంటి దారుణం జరగడంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
ALSO READ: Vande Bharat Train: ఫుల్లుగా తాగి ట్రాక్ మీద ఆటోను వదిలేసిన డ్రైవర్, ఒక్కసారిగా వందేభారత్..