Cabinet: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల దిశగా కీలక నిర్ణయాలను తీసుకుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం..ముఖ్యంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ రిజర్వేషన్లు ఎన్నికల ప్రక్రియలో బీసీ వర్గాల ప్రాతినిధ్యాన్ని గణనీయంగా పెంచనున్నాయి. ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం.. తొలుత డిసెంబర్ నెలలోనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది.
ఈ నిర్ణయం వెనుక ముఖ్యంగా ఆర్థికపరమైన కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి రూ. 3,000 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు ల్యాప్స్ (lapse) అయ్యే అవకాశం ఉండటంతో, ఆ నిధులను సద్వినియోగం చేసుకోవడం కోసం సర్పంచ్ ఎన్నికలకు త్వరగా వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్థానిక సంస్థలు లేని కారణంగా ఈ నిధులను వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది.
అయితే, మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికల గురించి మంత్రి పొంగులేటి స్పష్టతనిచ్చారు. హైకోర్టు తీర్పు వచ్చిన అనంతరం మాత్రమే ఎంపీటీసీ (MPTC), జెడ్పీటీసీ (ZPTC) ఎన్నికలకు వెళ్తామని ఆయన పేర్కొన్నారు. మొత్తంగా, బీసీ రిజర్వేషన్ల పెంపు, ఆర్థిక నిధుల ల్యాప్స్ అయ్యే ప్రమాదం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది.
సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందించాలని కేబినెట్ నిర్ణయించింది. మత సంప్రదాయాల ప్రకారం మృతదేహాలను అక్కడే ఖననం చేసేందుకు ఏర్పాట్లు చేస్తూ, ఒక్కో కుటుంబం నుంచి ఇద్దరు సభ్యులను సౌదీకి తీసుకెళ్లడానికి ప్రభుత్వం సహకరిస్తుంది. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు మంత్రి అజారుద్దీన్, ఎంఐఎం ఎమ్మెల్యే, మైనారిటీ అధికారిలతో కూడిన ప్రభుత్వ బృందాన్ని వెంటనే సౌదీకి పంపాలని నిర్ణయించారు.
ప్రముఖ కవి, రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ మరణం నేపథ్యంలో, ఆయన కుమారుడు ఎ. దత్త సాయికి డిగ్రీ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ పాత్రను భావితరాలకు తెలియజేయడానికి అందెశ్రీ స్మృతి వనం ఏర్పాటు చేయాలని, అలాగే ఆయన రచించిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని పాఠశాల పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని నిర్ణయించారు.
ఇతర ముఖ్య నిర్ణయాలలో.. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 మెయిన్ కెనాల్కు మాజీ మంత్రి దివంగత రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెట్టేందుకు (RDR ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 కెనాల్) కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే, అవుటర్ రింగ్ రోడ్ (ORR) లోపల ఉన్న ఇండస్ట్రియల్ ల్యాండ్ను మల్టీ యూజ్ జోన్స్ గా మార్చేందుకు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (HILTP)కి ఆమోదముద్ర పడింది. పంచాయతీ ఎన్నికలను డిసెంబర్ నెలలోనే పూర్తి చేయాలని నిర్ణయిస్తూ, రిజర్వేషన్ల జాబితా కోసం వారం రోజుల్లో డెడికేటెడ్ కమిషన్ నుంచి నివేదిక కోరాలని అధికారులను ఆదేశించింది. ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 నిర్వహించాలని.. 9వ తేదీన తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు.