Medchal District: మేడ్చల్ జిల్లాలో చైన్ స్నాచర్లు రోజురోజుకీ రెచ్చిపోతున్నారు. పట్టపగలే కేవలం గంటల వ్యవధిలోనే జిల్లాలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్లకు తెగబడటం నగరవాసులను, ముఖ్యంగా మహిళలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. నాచారం పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలోనే ఈ దారుణానికి పాల్పడటం పోలీసులకే సవాల్ విసిరినట్లుగా ఉంది.
ఈ వరుస సంఘటనల్లో మొదటిది, అత్యంత ధైర్యంగా జరిగింది నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోనే. రాఘవేంద్ర నగర్కు చెందిన 45 ఏళ్ల కిరాణా దుకాణ నిర్వహకురాలు స్వప్న ఇవాళ ఉదయం 9 గంటలకు ఆలయంలో పూజలు ముగించుకుని.. తమ దుకాణం వైపు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆమె నాచారం పోలీస్ స్టేషన్ వెనుక భాగంలో ఉన్న భవాని నగర్ ప్రాంతంలో ఫోన్లో మాట్లాడుకుంటూ ఒంటరిగా నడుస్తున్న సమయంలో.. పల్సర్ బైక్పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను లక్ష్యంగా చేసుకున్నారు. వెనుక నుంచి దూసుకొచ్చిన దుండగులు మెడలోని బంగారపు పుస్తెల తాడును బలవంతంగా లాక్కుని వెళ్లారు. ఈ క్రమంలో పుస్తెల తాడు లాకెట్ కింద పడిపోయినప్పటికీ, దొంగలు సుమారు 3 తులాల బంగారు చైన్ను దొంగలించారు. బాధితురాలు గట్టిగా కేకలు వేసినా, నిందితులు మెరుపు వేగంతో వాహన నెంబర్ ప్లేట్ లేని బైక్పై ఉడాయించారు. ఈ సంఘటనపై బాధితురాలు నాచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కేవలం నాచారంలోనే కాకుండా.. అదే రోజు గంటల వ్యవధిలో జిల్లాలోని జవహర్ నగర్, శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా చైన్ స్నాచింగ్ సంఘటనలు చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ వరుస దొంగతనాలతో మేడ్చల్ జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ముఖ్యంగా.. నాచారంలో స్నాచింగ్కు పాల్పడిన దుండగులే మిగిలిన రెండు చోట్ల కూడా ఈ నేరాలకు పాల్పడ్డారా? లేక వేర్వేరు ముఠాలు ఈ వరుస దొంగతనాలకు కారణమా? అనే విషయంలో పోలీసులకు ఇంకా స్పష్టత రాలేదు. ఈ విషయమై వారు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పటిష్టమైన పోలీస్ స్టేషన్ల సమీపంలోనే ఇలాంటి సంఘటనలు జరగడం పట్ల స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుని, మహిళలకు భద్రత కల్పించాలని వారు కోరుతున్నారు.
ALSO READ: BRS: జూబ్లీహిల్స్లో దారుణ ఓటమి.. హైదరాబాద్లో పట్టు కోల్పోతున్న బీఆర్ఎస్