RV karnan: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిపాలనలో జరుగుతున్న విస్తరణ, వార్డుల విభజన ప్రక్రియపై జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ కీలక అంశాలను వెల్లడించారు. హైదరాబాద్ నగరం వేగంగా విస్తరిస్తూ దేశంలోనే అతిపెద్ద నగర పాలక సంస్థలలో ఒకటిగా రూపాంతరం చెందిందని ఆయన తెలిపారు. గతంలో 650 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న జీహెచ్ఎంసీ, ఇప్పుడు 2060 చదరపు కిలోమీటర్లకు విస్తరించిందన్నారు. ఈ విస్తరణతో పాటు జనాభా కూడా భారీగా పెరిగి, ప్రస్తుతం జీహెచ్ఎంసీ దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన మున్సిపల్ కార్పొరేషన్గా మారిందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో నగర పాలన మరింత సమర్థవంతంగా సాగేందుకు, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సహకారంతో జీహెచ్ఎంసీ అధికారులు సమగ్ర ఎక్సర్సైజ్ నిర్వహించి వార్డుల విభజన చేపట్టారని కమిషనర్ వివరించారు. గతంలో నగర అవుటర్ పరిధిలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, జీహెచ్ఎంసీ అంటూ నాలుగు రకాల పరిపాలనా వ్యవస్థలు ఉండేవని గుర్తు చేశారు. దీని వల్ల పాలనలో గందరగోళం, అభివృద్ధిలో అసమానతలు కనిపించేవని తెలిపారు. అయితే ఇప్పుడు 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లను జీహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకువచ్చి ఒకే పరిపాలనా వ్యవస్థగా మారిందని చెప్పారు.
ఈ విలీన ప్రక్రియ తర్వాతే జీహెచ్ఎంసీ వార్డుల విభజన చేపట్టాల్సిన అవసరం ఏర్పడిందని కమిషనర్ కర్ణన్ స్పష్టం చేశారు. జనాభా సమతుల్యత, భౌగోళిక సౌలభ్యం, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ విభజన జరిగిందన్నారు. జీహెచ్ఎంసీ వార్డుల విభజన ప్రక్రియను డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేస్తే రాబోయే జనగణనకు ఎంతో ఉపయోగపడుతుందని.. కేంద్ర ప్రభుత్వం కూడా సూచించిందని తెలిపారు.
వార్డుల విభజనపై ప్రజాప్రతినిధులు, సభ్యులు ఇచ్చే ప్రతి అభ్యంతరాన్ని పరిగణనలోకి తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు. లిఖితపూర్వకంగా అభ్యంతరాలు తెలియజేయడానికి రేపటితో చివరి తేదీగా నిర్ణయించామని చెప్పారు. ఇప్పటికే వార్డుల పేర్లు మార్చాలన్న అభ్యంతరాలు ఎక్కువగా వచ్చాయని, కొన్ని ప్రాంతాల్లో బౌండరీలపై కూడా సూచనలు, అభిప్రాయాలు అందాయని వివరించారు.
వార్డుల విభజనలో సహజ సరిహద్దులైన నాలాలు, ప్రధాన రహదారులు, రైల్వే లైన్లను ప్రామాణికంగా తీసుకున్నామని కమిషనర్ తెలిపారు. అలాగే రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్న కొన్ని వార్డులను ఒకే నియోజకవర్గానికి తీసుకువచ్చేలా సరిదిద్దినట్లు చెప్పారు. దీని ద్వారా ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యం స్పష్టంగా ఉండటంతో పాటు పరిపాలనా సౌలభ్యం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
భవిష్యత్ నగర విస్తరణను దృష్టిలో పెట్టుకుని కొన్ని ప్రాంతాల్లో అదనపు వార్డులు ఏర్పాటు చేసినట్లు కమిషనర్ వెల్లడించారు. ఉదాహరణకు తెల్లాపూర్ ప్రాంతంలో ప్రస్తుతం సుమారు 23 వేల జనాభా మాత్రమే ఉన్నప్పటికీ, రానున్న ఐదేళ్లలో అక్కడ 4 లక్షలకు పైగా జనాభా పెరిగే అవకాశం ఉందన్నారు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, హైరిజ్ భవనాలు, వాణిజ్య ప్రాజెక్టులు అక్కడ రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో ముందస్తుగా వార్డుల సంఖ్య పెంచామని వివరించారు.
జోన్ల విభజన ప్రక్రియ ఇంకా పూర్తికాలేదని, తాత్కాలికంగా సమీప మున్సిపాలిటీలను వివిధ జోన్లలో కలిపామని కమిషనర్ చెప్పారు. భవిష్యత్తులో జోన్లను కూడా శాశ్వతంగా పునర్వ్యవస్థీకరిస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం కొన్ని వార్డుల్లో జనాభా తక్కువగా కనిపించినా, రానున్న కాలంలో అక్కడ కూడా జనాభా పెరిగే అవకాశాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళిక రూపొందించామని తెలిపారు.
Also Read: కన్నవారిని రోడ్డున వదిలేస్తే కఠిన చర్యలు: వీసీ సజ్జనార్
ఈసారి జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, మేడ్చల్ ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించినట్లు కమిషనర్ కర్ణన్ వెల్లడించారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలు ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలోకి రావడంతో, సమన్వయంతో అభివృద్ధి జరగాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మొత్తంగా, ఈ వార్డుల విభజన ప్రక్రియ హైదరాబాద్ నగర భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన సమగ్ర ప్రణాళికగా కమిషనర్ కర్ణన్ పేర్కొన్నారు.