భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రి బండి సంజయ్ వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్, కాంగ్రెస్లను రాహు కేతువులతో పోల్చిన సంజయ్.. అసలు తను ఏ గ్రహమో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. నవగ్రహాల్లో బండి సంజయ్ ఎక్కడ ఉన్నారో ప్రజలకు చెప్పాలన్నారు. కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం కాకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేస్తున్నారో వివరించాలని కోరారు. మెట్రో ఫేజ్ 2, రీజనల్ రింగ్ రోడ్ (RRR), మూసీ ప్రక్షాళన వంటి కీలక అంశాలపై కేంద్ర మంత్రి తన వైఖరిని వెల్లడించాలని చామల సూచించారు. భువనగిరి లోక్సభ పరిధిలోకి నిధులు తీసుకువచ్చే దమ్ముంటే బండి సంజయ్, కిషన్ రెడ్డి కలిసి బహిరంగ సభ పెట్టాలని సవాల్ విసిరారు. ఆ సభకు పార్టీలకతీతంగా ప్రజలను సమీకరించే బాధ్యతను తాను తీసుకుంటానని ప్రకటించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ ద్వంద్వ నీతిని ఎంపీ ఎండగట్టారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ ఏటీఎంగా మార్చుకుందని ఆరోపించిన బీజేపీ నేతలు.. ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. 2025 ఆగస్టులోనే రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు అంగీకరించినప్పటికీ కేంద్రం ఎందుకు జాప్యం చేస్తోందని నిలదీశారు. బండి సంజయ్ పరిధిలోని శాఖలోనే సీబీఐ ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. 24 గంటల్లో విచారణ చేస్తామన్న మాటలు ఏమయ్యాయని అడిగారు. అవసరం లేని విషయాలకు కేంద్ర దర్యాప్తు సంస్థలను జేబు సంస్థల్లా వాడుకుంటున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం కుప్పకూలి లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగినా కేంద్రం పట్టించుకోకపోవడం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించారు.
రేపు జీవన్ రెడ్డి పరిస్థితి కూడా అంతే..
మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ మార్పుపై చామల కిరణ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డి ఆలోచన లేకుండా నిర్ణయం తీసుకున్నారని.. ఆయన రాజకీయ పండుగ నిన్నటితో ముగిసిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో అలిగితే పీసీసీ అధ్యక్షులు, ఏఐసీసీ కార్యదర్శులు స్వయంగా ఇంటికి వచ్చి బ్రతిమిలాడతారని.. కానీ బీఆర్ఎస్లో ఆ పరిస్థితి ఉండదని హెచ్చరించారు. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య నేడు బీఆర్ఎస్లో చేరి సోషల్ మీడియాలో వీడియోలు చేసుకునే స్థితికి వచ్చారని గుర్తు చేశారు. రేపు జీవన్ రెడ్డి పరిస్థితి కూడా అలాగే మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిని చేయాలని భావించిందని.. కేసీఆర్ కేవలం జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చి ఆయన స్థాయిని తగ్గించారని విమర్శించారు.
ALSO READ: కేసీఆర్, రేవంత్లది ‘వీణ-వాణి’ బంధం.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు