Chamala Kiran Kumar Reddy: భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్ కేవలం “ట్విట్టర్ టిల్లు” అని, సోషల్ మీడియా వేదికగా ఆయన రాస్తున్నవన్నీ చిల్లర మాటలని మండిపడ్డారు. రాజకీయాల్లో బూతు పదజాలానికి కేసీఆర్ కుటుంబమే ఆద్యులని విమర్శించిన ఆయన, దేశంలో బూతులకు నాయకుడు ఎవరని గూగుల్లో వెతికితే కేసీఆర్ పేరే వస్తుందని ఎద్దేవా చేశారు. గతంలో కేసీఆర్ ప్రజల పట్ల, ప్రతిపక్షాల పట్ల వాడిన అసభ్యకరమైన భాషను కేటీఆర్ ఒకసారి యూట్యూబ్లో చూసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష మనుషులను బట్టి ఉంటుందని, కేసీఆర్ కుటుంబానికి అర్థమయ్యే రీతిలోనే రేవంత్ రెడ్డి ప్రజల పక్షాన మాట్లాడుతున్నారని ఆయన స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారో, అప్పుల పాలు చేశారో ప్రజలకు అర్థమైందని, అందుకే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిగా చెంపదెబ్బ కొట్టారని చామల వ్యాఖ్యానించారు. ఆ తర్వాత 2024 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు గుండు సున్నా ఇచ్చారని, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ ప్రజలు బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయినా కేటీఆర్ తీరు మారలేదని, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల వేళ మళ్లీ చిల్లర మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన రెండు ఏళ్లలోనే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తెచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని తెలిపారు.
కేసీఆర్ కుటుంబం ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి, చివరకు వారి ఇంట్లో ఐదుగురికే ఐదు ఉద్యోగాలు ఇచ్చుకున్నారని ఎంపీ విమర్శించారు. తెలంగాణ ప్రజలు ఈ దొంగల ముఠా మాటలను పట్టించుకోవద్దని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అభివృద్ధి చెందాలంటే అధికార పార్టీ అభ్యర్థుల గెలుపు అవసరమని ఆయన పేర్కొన్నారు. కేటీఆర్ ట్విట్టర్లో పోస్టులు పెట్టినంత మాత్రాన వచ్చే నష్టమేమీ లేదని, ఐదేళ్ల తర్వాత ప్రజలే న్యాయ నిర్ణేతలని చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
Read Also: V Hanumantha Rao: మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయం: వీహెచ్