Mahavir Jayanti: నాన్ వెజ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్. వచ్చే ఆదివారం హైదరాబాద్ నగర వాసులకు నాన్ వెజ్ తినే ఛాన్స్ ఉండదు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. మహావీర్ జయంతి సందర్భంగా ఆ రోజున నగరంలో చికెన్, మటన్ షాపులు బంద్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.
ఆదివారం వచ్చిందంటే చాలు నాన్ వెజ్ ప్రియులు.. దగ్గర్లోని చికెన్, మటన్ షాపుల్లో క్యూ కడతారు. తమకి నచ్చిన నాన్ వెజ్ ఐటమ్ ఇంటికి తెచ్చుకుని ఎంచక్కా వండుకుని లాగించేస్తారు. అయితే ఏప్రిల్ 21 (వచ్చే ఆదివారం) నాన్ వెబ్ తినేవారికి తీవ్ర నిరాశ ఎదురుకానుంది. ఎందుకంటే ఆ రోజున చికెన్, మటన్ షాపులు బంద్ కానున్నాయి.
ఏప్రిల్ 21న జైన మత ప్రచారకుడు వర్ధమాన మహావీరుడి జయంతి. ఆ రోజును జైనులు ప్రతి సంవత్సరం ఎంతో పవిత్రంగా జరుపుకుంటారు. అందుకే జైనులకు ఎంతో పవిత్రమైన ఆరోజు హైదరాబాద్ నగరంలోని అన్ని చికెన్, మటన్ షాపులను మూసివేయాలని జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసింది.
మహావీర్ జన్నిదినోత్సం సందర్భంగా కబేళాలు, మీట్, బీఫ్ మార్కెట్లతో పాటుగా మాంసం దుకాణాలను మూసివేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు జారీ చేసింది. ఆదివారం కావడంతో గిరాకి ఎక్కువగా ఉంటుందని ఎవరైనా సరే విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. కాగా, సోమవారం నుంచి ఈ షాపులు ఎప్పటిలానే కొనసాగుతాయని తెలిపింది.