Chicken Shops Close: ఏప్రిల్ 1వ తేదీ నుంచి నాన్ వెజ్ ప్రియులకు బిగ్ షాక్ తగలనుంది. ఆ రోజు నుంచి రాష్ట్రంలో చికెన్ దుకాణాలను మూసివేయాలని చికెన్ షాపు ఓనర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. పౌల్ట్రీ కంపెనీలు ఇచ్చే మార్జిన్ సరిపోవడం లేదని.. ఈ విషయాన్ని ఎన్నిసార్లు వారి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని అసోసియేషన్ తెలిపింది. దీంతో రాష్ట్రం వ్యాప్తంగా షాపులు మూసివేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలియజేశాయి.
పౌల్ట్రీ కంపెనీలు.. గతంలో ఇచ్చే మార్జిన్ కంటే రూ.20 తక్కువ ఇస్తున్నారని చికెన్ వ్యాపారులు ఆరోపిస్తున్నారు. రోజు రోజుకు చికెన్ రేటు పెరుగుతుంటే.. తమకు ఇచ్చే మార్జిన్ మాత్రం తగ్గిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చికెన్ షాపులను పౌల్ట్రీ కంపెనీలు తమ మార్జిన్ పెంచకపోతే.. పెద్ద ఎత్తున ధర్నాను సైతం నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నారు. సరైన మార్జిన్ లేకపోతే.. వ్యాపారం చేయలేని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.
మరోవైపు ఇప్పటికే హైదరాబాద్ వంటి నగరాల్లో చికెన్ షాపుల క్లోజ్ కు సంబంధించిన పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. ఎల్బీనగర్, ఉప్పల్, నాంపల్లి తదితర ప్రాంతాల్లోని చికెన్ షాపుల ముందు బంద్ కు సంబంధించిన పోస్టర్లు కనిపిస్తున్నాయి. పౌల్ట్రీ కంపెనీలు ఏకపక్షంగా ధరలు నిర్ణయించడం వల్ల.. తమకు లాభాలు లేకుండా పోతోందని నగరంలోని చికెన్ వ్యాపారులు సైతం చెబుతున్నారు. సమస్య త్వరగా పరిష్కరించకపోతే ఆందోళనలు మరింత తీవ్రతరం చేయక తప్పదని వారు కూడా హెచ్చరిస్తున్నారు.
మరోవైపు పౌల్ట్రీ కంపెనీల వాదన మరోలా ఉంది. మార్కెట్ పరిస్థితులు, డిమాండ్ – సప్లై మధ్య ఉన్న తేడాల కారణంగా మార్జిన్లను తగ్గించాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొంటున్నాయి. ఈ విషయంలో చికెన్ షాపు యజమానుల సంఘంతో చర్చలు జరుగుతున్నట్లు తెలిపింది. ఇదిలా ఉంటే చికెన్ షాపుల బంద్ నేపథ్యంలో.. నాన్ వెజ్ ప్రియుల్లో ఆందోళన మెుదలైంది. తెలంగాణ ప్రభుత్వం ఈ అంశంలో జోక్యం చేసుకొని.. చికెన్ షాపు యజమానుల సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఇప్పటికే గ్యాస్, పెట్రోల్ లభ్యతపై ఆందోళనలో ఉన్న తమకు.. ఈ చికెన్ బంద్ ద్వారా మరింత ఒత్తిడి పెరగకుండా చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో కిలో చికెన్ రూ.350 నుంచి రూ.370 పలుకుతోంది.