CM Revanth Reddy: నేడు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక కార్యక్రమం చేపట్టింది. కోటి మంది మహిళలకు కోటి చీరలను ఉచితంగా పంపిణీ చేయనుంది. ఇందిరమ్మ చీరల పంపిణీపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీర అందించాలని సూచించారు. చీరల ఉత్పత్తి ఆలస్యం కారణంగా రెండు దశల్లో పంపిణీ చేయాలన్నారు. నేటి నుంచి డిసెంబర్ 9 వరకు మొదటి దశలో గ్రామాల్లో పంపిణీ పూర్తి చేయాలని తెలిపారు. రెండో దశలో మార్చి 1 నుంచి 8 వరకు మహిళా దినోత్సవానికి పట్టణాల్లో పంపిణీ పూర్తి చేయాలన్నారు. చీరల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని సీఎం ఆదేశించారు. పంపిణీని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
సీఎం రేవంత్ రెడ్డి స్పిచ్..
నేడు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ.. దేశంలో రాజకీయ శూన్యత ఏర్పడిన సమయంలో ఇందిరా గాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆమె అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఎంతో కృషి చేశారు అని తెలిపారు.
అయితే ఇందిరమ్మ ప్రధానిగా పనిచేసినప్పుడు బ్యాంకుల జాతీయ కరణ, అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తెచ్చి పేదలకు భూములు పంచినా, పేదలకు ఇండ్లు కట్టించినా అది ఒక్క ఇందిరమ్మకే సాధ్యమైంది. అంతేకాకుండా పాకిస్థాన్తో యుద్ధం సమయంలో ధీటుగా నిలబడి ఎదుర్కొన్న ధీశాలి ఇందిరమ్మ.. దేశానికి బలమైన నాయకత్వం అందించిన ఘనత ఇందిరాగాంధీ గారిది. ఇప్పుడు ఇందిరమ్మ స్ఫూర్తితోనే మా ప్రభుత్వం ముందుకు వెళుతోంది అని సీఎం పేర్కొన్నారు..
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం మా కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు పెట్రోల్ బంక్లు నిర్వహించుకునేలా ప్రోత్సహించాం.. ఆర్టీసీలో వెయ్యి బస్సులకు మహిళలని యజమానులను చేశాం.. మహిళల సంక్షేమంతో పాటు ఆర్థిక ఉన్నతి కలిగించే కార్యక్రమాలు చేపట్టాం.. ఆడబిడ్డల పేరుతోనే ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నాం.. రాజకీయాల్లోనూ మహిళలకు తగిన ప్రాధాన్యత కల్పించాం అని తెలిపారు.
అలాగే కాంగ్రెస్ కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులని చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం పని చేస్తుందన్నారు. తెలంగాణ ఆడబిడ్డలకు ప్రభుత్వం తరపున సారె పెట్టి గౌరవించాలని భావించాం.. అందుకే కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించాం..
నేడు ఇందిరమ్మ జయంతి రోజున ప్రారంభించిన ఈ కార్యక్రమం డిసెంబర్ 9 వరకు గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ చేస్తాం.. అలాగే మార్చి 1 నుంచి 8 న మహిళా దినోత్సవం వరకు పట్టణ ప్రాంతాల్లో పంపిణీ చేస్తాం.. ఆందోళన చెందొద్దు.. ప్రతీ ఆడబిడ్డకు చీరను అందిస్తాం అన్నారు.
Also Read: భారీ షాక్ ఇచ్చిన బంగారం ధరలు.. నేడు ఒక్క రోజే ఎంత పెరిగిందంటే..?
అయితే మొదటి విడతలో 65 లక్షల చీరలు పంపిణీ చేయబోతున్నాం.. చీరల ఉత్పత్తికి సమయం పడుతున్న నేపథ్యంలో రెండు విడతలుగా చీరలను పంపిణీ చేస్తున్నాం అన్నారు. మహిళా మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు, మహిళా అధికారులు ఇందిరమ్మ చీర కట్టుకోవాలి.. మీరే బ్రాండ్ అంబాసిడర్గా మారి ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటాలన్నారు.