Illegal constructions: హుజురాబాద్ బ్యూరో, స్వేచ్చ: హుజురాబాద్ పట్టణ సమీపంలోని పెద్దపాపయ్యపల్లె గ్రామ శివారులో గల చిలుక వాగు ఇప్పుడు ఆక్రమణదారుల కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. ప్రకృతి ప్రసాదించిన ఈ జలవనరును రియల్ మాఫియా తన ధనదాహంతో కనుమరుగు చేస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాగులు, వంకల శిఖం (FTL) పరిధిలో లేదా బఫర్ జోన్లలో ఎటువంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు. కానీ, ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏకంగా వాగు నడిబొడ్డున టన్నుల కొద్దీ మట్టి పోసి, సహజసిద్ధమైన ప్రవాహ దిశను మార్చేస్తూ రాత్రికి రాత్రే భారీ పునాదులు లేపుతున్నారు.
చట్టాలనైనా చుట్టేస్తాం” అన్న ధీమాతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు బరితెగిస్తున్నారు. అధికారుల అండదండలు ఉన్నాయో లేక వ్యవస్థలోని లొసుగులు తెలుసో కానీ, కనీస కనికరం లేకుండా వాగు ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నారు. సామాన్యుడు చిన్న ప్రహరీ గోడ కట్టుకుంటే నోటీసులు ఇచ్చే అధికారులు, వేల గజాల వాగు గర్భాన్ని కబ్జా చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని స్థానికులు నిలదీస్తున్నారు. ఈ అక్రమార్కుల ధనబలం ముందు ప్రకృతి వనరులు బలైపోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.
ఈ భూములకు సంబంధించి ఒకవేళ పట్టాలు ఉన్నా, చట్టం ప్రకారం అక్కడ ఎటువంటి కాంక్రీట్ నిర్మాణాలు చేయడానికి వీల్లేదు. పట్టా భూమి వాగు పరిధిలో ఉన్నప్పుడు దానిని కేవలం వ్యవసాయ అవసరాలకు మాత్రమే ఉపయోగించుకోవాలి. కానీ, ఇక్కడ చట్టాలను తమకు అనుకూలంగా చుట్టేసుకున్న ఆక్రమణదారులు, సాగు చేయాల్సిన చోట అక్రమంగా పక్కా భవనాలు నిర్మిస్తున్నారు. రెవెన్యూ మరియు నీటి పారుదల శాఖ అధికారులు కళ్లున్నా కబోదుల్లా వ్యవహరించడం వెనుక భారీగా చేతులు మారాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
చిలుక వాగును ఇలాగే ఆక్రమిస్తూ పోతే, రానున్న రోజుల్లో హుజురాబాద్ పట్టణానికి భారీ ముప్పు పొంచి ఉంది. భారీ వర్షాలు కురిసినప్పుడు నీరు వెళ్లే దారి లేక సమీప జనావాసాలు జలమయం కావడం ఖాయం. అధికారుల ఉదాసీనత వల్ల రేపు సంభవించే ప్రాణ, ఆస్తి నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రకృతి సిద్ధమైన నీటి వనరులను ధ్వంసం చేయడం వల్ల భూగర్భ జలమట్టం పడిపోవడమే కాకుండా, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని పర్యావరణ ప్రేమికులు హెచ్చరిస్తున్నారు.
జిల్లా కలెక్టర్, ఆర్డీవో (RDO) తక్షణమే స్పందించి ప్రత్యేక బృందాలతో క్షేత్రస్థాయి విచారణ జరపాలని హుజురాబాద్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పట్టా ఉన్నా సరే అక్కడ నిర్మాణాలు చేయడానికి అనుమతి లేదనే విషయాన్ని స్పష్టం చేస్తూ, అక్రమంగా వెలిసిన కట్టడాలను వెంటనే కూల్చివేసి వాగు గర్భాన్ని పునరుద్ధరించాలి. ఆక్రమణదారులపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.