Keesara Kite String Injury: సంక్రాంతి పండుగ ఇంకా రానేలేదు.. అప్పుడే “చైనా మాంజా” (Chinese Manja) రూపంలో మృత్యువు రోడ్లపై సంచరిస్తోంది. సరదా కోసం ఎగురవేసే గాలిపటాలు.. అమాయక వాహనదారుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. నిషేధిత నైలాన్ మాంజా వాడకం వల్ల కీసరలో జరిగిన ఓ ఘోర ప్రమాదం స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది.
కీసరలోని మల్లికార్జున నగర్ కాలనీకి చెందిన పినింటి సుధాకర్ రెడ్డి కుమారుడు జశ్వంత్ రెడ్డి తన బైక్పై వ్యవసాయ పొలం వద్దకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో గాలిలో ఎగురుతూ వచ్చిన ఓ గాలిపటం దారం (మాంజా) ఒక్కసారిగా జశ్వంత్ మెడకు చుట్టుకుంది. ఏదో సాధారణ దారం అనుకునేలోపే అది కత్తిలా మారి గొంతును కోసేసింది. నైలాన్ మరియు గాజు పొడితో తయారు చేసిన ఆ మాంజా బలంగా ఉండటంతో మెడ భాగంలో లోతైన గాయమైంది.
వెంటనే స్థానికులు స్పందించి జశ్వంత్ రెడ్డిని కీసరలోని నితిన్ ఆసుపత్రికి తరలించారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో వైద్యులు సుమారు 19 కుట్లు వేశారు. ప్రస్తుతం జశ్వంత్ చికిత్స పొందుతున్నాడు. దారం ఇంకొంచెం లోతుగా దిగి ఉంటే ప్రాణానికే ప్రమాదం వాటిల్లేదని వైద్యులు అంటున్నారు.
సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో ఆకాశంలో గాలిపటాల సందడి మొదలైంది. అయితే, ప్రభుత్వం పర్యావరణానికి, పక్షులకు, మనుషులకు హానికరమని చైనా మాంజాను (ప్లాస్టిక్/నైలాన్ దారం) నిషేధించినప్పటికీ, వ్యాపారులు కాసుల కక్కుర్తితో దొంగచాటుగా విక్రయిస్తున్నారు. కీసరలోని పలు దుకాణాల్లో ఈ మృత్యు పాశాలు యథేచ్ఛగా లభిస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. సాధారణ దారం తెగిపోతుంది కానీ, ఈ చైనా మాంజా మాత్రం తెగకుండా చర్మం, మాంసాన్ని కోసేస్తుంది.
ఇది కేవలం జశ్వంత్ రెడ్డికి జరిగిన ప్రమాదం మాత్రమే కాదు, రేపు మరొకరికి జరగకూడదు. సంక్రాంతి పండుగ రోజుల్లో బైక్పై వెళ్లాలంటేనే జనం భయపడే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం, పోలీసులు తక్షణం స్పందించి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
చైనా మాంజా విక్రయించే షాపులపై ఆకస్మిక దాడులు చేయాలి.
నిషేధిత మాంజాను విక్రయిస్తే కఠిన శిక్షలు, జరిమానాలు విధించాలి.
తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు చైనా మాంజా కొనివ్వకుండా బాధ్యత వహించాలి.
ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఈ మృత్యు దారాలను మార్కెట్ నుంచి ఏరివేయకపోతే, పండుగ పూట మరిన్ని విషాదాలు చూడాల్సి వస్తుందని ప్రజలు హెచ్చరిస్తున్నారు.