భూపాలపల్లి జిల్లాలో చట్టాన్ని రక్షించాల్సిన అధికారి, అధికార పార్టీ నాయకుడి కనుసన్నల్లో నడుస్తూ బాధితులను వేధిస్తున్నారనే ఆరోపణలు ఇప్పుడు జిల్లాలో కలకలం రేపుతున్నాయి. చిట్యాల మండల కేంద్రంలో ఎస్సై శ్రవణ్ రావు వ్యవహరిస్తున్న తీరుపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వాహనంలో 55 రోజుల తర్వాత గుడుంబా దొరికిందని కేసు నమోదు చేయడం ఇప్పుడు పోలీసు శాఖలో హాట్ టాపిక్ గా మారింది.
అసలేం జరిగింది?
బాధితుల కథనం ప్రకారం.. గత ఏడాది నవంబర్ 21, 2025న చిట్యాల మండల కేంద్రంలో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో వీరి వాహనం దొరికింది. ఆ సమయంలో వాహనాన్ని స్వాధీనం చేసుకున్న ఎస్సై శ్రవణ్ రావు, మరుసటి రోజు ఉదయం వచ్చి బండి తీసుకెళ్లాలని చెప్పారు. తీరా మరుసటి రోజు వెళ్తే.. ఏదో ఒక సాకు చెబుతూ కాలయాపన చేస్తూ వచ్చారు. ఇలా రోజులు కాస్తా వారాలు.. వారాలు కాస్తా నెలలుగా మారి ఏకంగా 55 రోజులు గడిచిపోయాయి.
‘గుడుంబా’ కథ
ఇన్ని రోజులు బండి చుట్టూ తిరిగించుకున్న ఎస్సై, ఇప్పుడు అకస్మాత్తుగా ఒక కొత్త కథను తెరపైకి తెచ్చారు. సదరు వాహనంలో గుడుంబా దొరికిందని, అందుకే కేసు నమోదు చేస్తున్నామని చెప్పడంతో బాధితులు విస్తుపోయారు. 55 రోజుల పాటు పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న వాహనంలో ఇప్పుడు గుడుంబా ఎలా వచ్చిందని వారు ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా ఎక్కడైనా నిషేధిత వస్తువులు దొరికితే, వాటితో పాటు నిందితులను ఉంచి ఫోటోలు తీసి మీడియాకు సమాచారం ఇవ్వడం నిబంధన. కానీ, అవేమీ లేకుండా ఇప్పుడు ఆకస్మాత్తుగా కేసు పెట్టడం వెనుక కుట్ర దాగి ఉందని బాధితులు ఆరోపిస్తున్నారు.
రాజకీయ ఒత్తిళ్లే కారణమా?
చింతకుంట రామయ్యపల్లి గ్రామానికి చెందిన ఒక కాంగ్రెస్ నాయకుడిని సంతృప్తి పరచడానికే ఎస్సై శ్రవణ్ రావు తమపై కక్ష గట్టారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సదరు నాయకుడి ప్రోద్బలంతోనే ఎక్కడి నుంచో గుడుంబా తెచ్చి, తమ బండిలో దొరికినట్లు కట్టుకథ అల్లి తప్పుడు కేసు పెట్టారని వారు ఆరోపిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ విషయాన్ని తాము అంగీకరిస్తున్నామని, దానికి సంబంధించిన జరిమానా కట్టడానికి సిద్ధంగా ఉన్నామని.. కానీ లేని గుడుంబా కేసును తమపై రుద్దడం అన్యాయమని వారు వాపోతున్నారు.
పోలీస్ స్టేషన్లో వాహనం భద్రంగా ఉంటుందని నమ్మి వదిలేస్తే.. దానినే అడ్డం పెట్టుకొని ఎస్సై వేధింపులకు గురిచేయడంపై బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికైనా జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి, చిట్యాల ఎస్సై శ్రవణ్ రావుపై విచారణ జరపాలని, తప్పుడు కేసు నుంచి తమను రక్షించి, తమ వాహనాన్ని తమకు ఇప్పించాలని బాధితులు వేడుకుంటున్నారు.