తెలంగాణలో నిరుద్యోగులకు తీపి కబురు అందుతోంది. రాష్ట్ర పోలీస్ శాఖలో భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. రిటైర్మెంట్ల కారణంగా ఏర్పడిన ఖాళీలను భర్తీ చేస్తూ, శాంతిభద్రతల పరిరక్షణకు పెద్దపీట వేయాలనే యోచనలో సర్కార్ ఉన్నట్టు తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ప్రభుత్వం భారీ ఊరటనిచ్చే వార్తను అందించింది. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న వేలాది పోస్టుల భర్తీకి కసరత్తు వేగవంతమైంది. ముఖ్యంగా కానిస్టేబుల్, సబ్ ఇన్ స్పెక్టర్ (SI) స్థాయి పోస్టుల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది అభ్యర్థుల నిరీక్షణ త్వరలోనే ఫలించనుంది. రిటైర్మెంట్ల కారణంగా ఏర్పడిన ఖాళీలను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.
రిటైర్మెంట్ల వెల్లువ – పెరిగిన ఖాళీలు
గత కొంతకాలంగా పోలీస్ శాఖలో భారీ స్థాయిలో పదవీ విరమణలు చోటు చేసుకున్నాయి. పోలీస్ శాఖ అందించిన తాజా నివేదిక ప్రకారం.. 2024 నుంచి ఈ ఏడాది జనవరి వరకు రాష్ట్రంలో దాదాపు 17,000 మంది సిబ్బంది పదవీ విరమణ పొందారు. ఇందులో అత్యధికంగా కానిస్టేబుల్, ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది 15,900 మంది ఉండగా, ఎస్సై (SI), సీఐ (CI), ఇతర ఉన్నతాధికారుల సంఖ్య 1,100 గా ఉంది. ఈ స్థాయిలో ఖాళీలు ఏర్పడటంతో పోలీస్ స్టేషన్లలో పని ఒత్తిడి పెరిగిందని.. దీనిని అధిగమించేందుకు తక్షణ నియామకాలు అవసరమని హోంశాఖ భావిస్తోంది.
గ్రేటర్ హైదరాబాద్పై ప్రత్యేక దృష్టి
రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెరిగిన జనాభా, భద్రతా సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అత్యధిక పోస్టులను భర్తీ చేయనున్నారు. ఒక్క హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే దాదాపు 6,000 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. నగరంలో శాంతిభద్రతల నిర్వహణకు ఆటంకం కలగకుండా ఉండేందుకు ఈ ఖాళీలను ప్రాధాన్యత క్రమంలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. సివిల్, ఏఆర్ (AR) విభాగాల్లో ఈ పోస్టులు ఎక్కువగా ఉండనున్నాయి.
ఆర్థిక శాఖ క్లియరెన్స్కు సిద్ధమైన ఫైల్
మొత్తం 14,000 కు పైగా పోస్టుల భర్తీకి సంబంధించి హోంశాఖ నుంచి ఆర్థిక శాఖకు ఫైల్ వెళ్ళినట్లు తెలుస్తోంది. ఆర్థిక శాఖ అనుమతి లభించిన వెంటనే తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) అధికారిక నోటిఫికేషన్ జారీ చేయనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం నుంచి ప్రాథమిక అనుమతులు లభించినట్లు సమాచారం. ప్రభుత్వం ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
అభ్యర్థులు సన్నద్ధం కావాలి
నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నందున నిరుద్యోగులు తమ ప్రిపరేషన్ను ముమ్మరం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫిజికల్ ఈవెంట్స్ కీలక పాత్ర పోషిస్తాయి కాబట్టి, ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రాక్టీస్ ప్రారంభించడం ఉత్తమం. అదేవిధంగా రాత పరీక్షల కోసం సమగ్రమైన ప్రణాళికతో చదవడం ద్వారా ఈ కొలువుల జాతరలో విజయం సాధించవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.