అనంతపురం అర్బన్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. స్థానిక ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ప్రధాన అనుచరుల వ్యవహారశైలిపై సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించడంతో.. పోలీసులు రంగంలోకి దిగి ఎమ్మెల్యే అనుచరులపై కేసులు నమోదు చేశారు.
వరుస వివాదాలు – సీఎం ఆరా..
గత కొద్దిరోజులుగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. భూ వివాదాలు, దాడులు, బెదిరింపుల పర్వంపై నిఘా వర్గాల ద్వారా సమాచారం అందుకున్న సీఎం చంద్రబాబు, స్వయంగా ఈ వ్యవహారంపై ఆరా తీశారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదని, పార్టీ క్యాడర్ క్రమశిక్షణ తప్పితే సహించేది లేదని ఆయన స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.
ముఖ్యంగా ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్కు అత్యంత సన్నిహితుడైన గంగారాం లక్ష్యంగా మూడు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. నగరంలో సంచలనం సృష్టించిన భూ కబ్జా యత్నం కేసులో గంగారాం పాత్ర ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. స్థానిక ఎగ్జిబిషన్ సెంటర్ నిర్వాహకుడిపై భౌతిక దాడికి పాల్పడిన ఘటనలో మరో కేసు నమోదైంది. ఒక వైన్ షాపును తగులబెట్టేందుకు ప్రయత్నించిన వ్యవహారంలో గంగారాంను ప్రధాన నిందితుడిగా పోలీసులు FIRలో పేర్కొన్నారు.
పోలీసుల గాలింపు – అజ్ఞాతంలోకి నిందితులు..
సీఎం ఆదేశాలతో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిన పోలీసులు, నిన్నటి నుంచి ఎమ్మెల్యే అనుచరుల కోసం విస్తృతస్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసుల రాకను ముందే పసిగట్టిన ప్రధాన అనుచరుడు గంగారాం ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. గంగారాంతో పాటు ఈ అక్రమాల్లో పాలుపంచుకున్న మిగిలిన అనుచరుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా విడిపోయి వేట కొనసాగిస్తున్నారు.
ప్రభుత్వ వైఖరి స్పష్టం..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతిభద్రతల విషయంలో రాజీ పడకూడదని చంద్రబాబు భావిస్తున్నారు. సొంత పార్టీ నేతల అనుచరులైనా సరే, సామాన్యులను ఇబ్బంది పెడితే ఉపేక్షించవద్దని ఉన్నతాధికారులకు ఆదేశాలు వెళ్లాయి. ఈ పరిణామం అనంతపురం జిల్లాలోని ఇతర నేతల్లో కూడా వణుకు పుట్టిస్తోంది. ఎమ్మెల్యే ప్రసాద్ దీనిపై ఎలా స్పందిస్తారో అన్నది ఇప్పుడు నియోజకవర్గంలో ఆసక్తికరంగా మారింది.
ALSO READ: Hyderabad News: మంత్రి, అధికారులపై తప్పుడు కథనాలు.. జర్నలిస్టుల అరెస్టుని ఖండించిన జగ్గారెడ్డి