Minimum Wages Hike: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలోని 1.11 కోట్ల మంది కార్మికులకు తీపి కబురు అందించారు. వారి కనీస వేతనాలను రూ.20 వేల వరకూ పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. గురువారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో కోటి 11 లక్షల మంది కార్మికులు నష్టపోయారని ఆరోపించారు. అందుకే తమ ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీని నియమించి.. కార్మికుల సమస్యలపై చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు రేవంత్ వివరించారు.
కార్మికులను మెుత్తం నాలుగు కేటగిరీలుగా తీసుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అన్ స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్ గా కార్మికులను విభజించినట్లు స్పష్టం చేశారు. అదే సమయంలో రాష్ట్రాన్ని నగర, పట్టణ, గ్రామీణ అనే 3 జోన్లుగా విభజించినట్లు చెప్పారు. జోన్ – 1 లో మున్సిపల్ కార్పోరేషన్స్, జోన్ – 2లో మున్సిపాలిటీలు, జోన్ – 3లో గ్రామీణ ప్రాంతాలను తీసుకొని కార్మికులకు కనీస వేతనాన్ని నిర్ణయించినట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణలో కనీస వేతనాల పెంపు: సీఎం రేవంత్ రెడ్డి
క్యాబినెట్ సబ్కమిటీ నివేదిక మేరకు రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజించి.. కనీస వేతనాలను పెంచుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు
పెంచిన వేతనాలు జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయన్నా సీఎం రేవంత్
జోన్ -1లో అన్స్కిల్డ్ కార్మికుల… pic.twitter.com/Bd60WkxBJM
— BIG TV Breaking News (@bigtvtelugu) May 21, 2026
అన్ స్కిల్డ్ కేటగిరీలో కనీస వేతనాన్ని రూ.12,750 నుంచి రూ.16 వేలకు పెంచినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే సెమీ స్కిల్డ్ కేటగిరీలో రూ.13,152 నుంచి రూ.17 వేలకు, స్కిల్డ్ కేటగిరీలో రూ.13,772 నుంచి రూ.18,500కు, హైలీ స్కిల్డ్ కేటగిరీలో రూ.14,607 నుంచి రూ.20 వేలకు కనీస వేతనాన్ని పెంచినట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 1.11 కోట్ల మంది కార్మికులకు మేలు జరుగుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం నిర్ణయించిన కొత్త కనీస వేతనాలు జూన్ 1 వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావం తరువాత మొట్ట మొదటిసారిగా కార్మికుల సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయం ఇదని ఆయన కొనియాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తన బాధ్యతను వదిలేసిందన్న రేవంత్.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బాధ్యతతో కార్మికుల ప్రయోజనం కోసం నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు.
Also Read: ఏసీ యూజర్లకు గుడ్ న్యూస్.. ఈ WHO ఫార్ములాతో.. 70% కరెంటు బిల్లు ఆదా!
కార్మిక నాయకుడు అనగానే ముందుగా వెంకటస్వామి గుర్తుకు వస్తారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ఆయన వారసుడిగా వివేక్ కార్మికుల సంక్షేమం కోసం మంచి నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ‘యువతకు నేను ఒకటే సూచన చేస్తున్నా. ఐటీ, అమెరికా అనే ఆలోచనను వీడండి. ఉద్యోగాలు రాని, ఉపాధి అవకాశాలు లేని చదువులు వ్యర్థం. సాంకేతిక నైపుణ్యంతో జర్మనీ, జపాన్, సింగపూర్ లాంటి ఇతర దేశాల్లో అనేక అవకాశాలు ఉన్నాయి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి యువతను ప్రోత్సహిస్తోంది. ఆ దిశగా యువత దృష్టి సారించాలి’ అంటూ సీఎం రేవంత్ యూత్ కు పిలుపునిచ్చారు.
Also Read: Window AC: టెక్నాలజీ మారినా.. కాలం మారినా.. విండో ఏసీల రూటే సెపరేటు!