Indiramma Saree Scheme: కోటి మంది అర్హత గల మహిళలకు కోటి చీరలు పంపిణీ చేసే బృహత్తర కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చజెండా ఊపారు. రేపు ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఈ ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ తీరుపై సీఎం రేవంత్ ఈరోజు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ చీరలను సిరిసిల్ల చేనేత కార్మికులే తయారు చేశారు. తయారీ ప్రక్రియలో కొంత ఆలస్యం జరగటం వల్ల వీటి పంపిణీని రెండు దశల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.మొదటి దశ పంపిణీ గ్రామీణ ప్రాంతాలలో జరుగుతుంది. రేపటి నుంచి డిసెంబర్ 9వ తేదీ లోపల గ్రామాల్లో పంపిణీని తప్పనిసరిగా పూర్తి చేయాలి అని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు.
రెండవ దశ పంపిణీ పట్టణ ప్రాంతాలలో పంపిణీ చేయనున్నారు. మార్చి 1వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ (అంతర్జాతీయ మహిళా దినోత్సవం) లోపల పట్టణ ప్రాంతాల పంపిణీ పూర్తి కావాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మహిళా దినోత్సవానికల్లా ఈ పథకం ఫలాలు పట్టణ మహిళలకు అందాలని ఆయన ఆకాంక్షించారు.
చీరల నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదు అని సీఎం రేవంత్ అధికారులకు తేల్చి చెప్పారు. పంపిణీ ప్రక్రియలో ఎటువంటి లోపాలు లేకుండా, పారదర్శకత కోసం టెక్నాలజీని వినియోగించాలని ఆయన సూచించారు. ఈ మొత్తం పంపిణీ కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.
ఈ ప్రతిష్టాత్మక పథకం ప్రారంభంలో భాగంగా.. నెక్లెస్ రోడ్ వద్ద ఇందిరా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం పంపిణీ కార్యక్రమం మొదలవుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, సీఎం రేవంత్ రెడ్డి గ్రామీణ మహిళలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు.
ALSO READ: Medak News: లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డ ఎస్ఐ.. టపాకాయలు కాల్చి ఊరుఊరంతా సంబరాలు