Hyderabad: వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులకు ప్రమాదాలు వరుసగా వెంటాడుతున్నాయి. ఇటీవల ఇదే ట్రావెల్స్కు చెందిన బస్సు ఘోర ప్రమాదానికి గురైన ఘటన మరువకముందే, తాజాగా మరో బస్సు నడిరోడ్డుపై ప్రమాదకర స్థితిలో నిలిచిపోయింది.
హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తున్న వేమూరి ట్రావెల్స్ బస్సు (నెంబర్ PY 04 A2542) పెద్ద అంబర్పేట్ ఫ్లైఓవర్ పైకి చేరుకోగానే టైర్ల నుంచి దట్టమైన పొగలు వచ్చాయి. బస్సు ఇంజిన్ ఓవర్ హీట్ కావడంతో ఈ సమస్య తలెత్తినట్లు గుర్తించారు. పొగలు రావడంతో భయాందోళనకు గురైన 26 మంది ప్రయాణికులు వెంటనే బస్సు దిగేశారు.
అయితే, తీవ్రమైన చలిలో ఫ్లైఓవర్ పైనే దాదాపు గంటకు పైగా ప్రయాణికులు పడిగాపులు కాయాల్సి వచ్చింది. ప్రయాణికులు ఇంత ఇబ్బంది పడుతున్నా వేమూరి ట్రావెల్స్ యాజమాన్యం పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిత్యం ఏదో ఒక ప్రమాదంతో వార్తల్లో నిలుస్తున్నా, యాజమాన్యం వాహనాల ఫిట్నెస్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తోందని ప్రయాణికులు మండిపడుతున్నారు. గత ప్రమాదాల నుంచి పాఠాలు నేర్చుకోకుండా యాజమాన్యం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.