Amazon Data center: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం పర్యటనలో తెలంగాణ పారిశ్రామిక, సాంకేతిక రంగాల్లో ఒక సరికొత్త అధ్యాయం ఏర్పడింది. బుధవారం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో అమెజాన్ డేటా సెంటర్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత వైభవంగా భూమి పూజ చేశారు. ఐటీ రంగంలో మైలురాయిగా నిలిచే ఈ ప్రాజెక్టుతో పాటు మహబూబ్నగర్, వనపర్తి జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
ఫ్యూచర్ సిటీలో అమెజాన్ శంకుస్థాపన
మీర్ఖాన్పేట రెవెన్యూ పరిధిలోని బేగరికంచలో బుధవారం మధ్యాహ్నం అమెజాన్ డేటా సెంటర్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవసరాల కోసం ఈ మెగా ప్రాజెక్టును ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం ఫ్యూచర్ సిటీలో 202 ఎకరాలు, చందన్ వెల్లిలో మరో 98 ఎకరాలను కేటాయించడంతో పాటు రూ. 125 కోట్ల విలువైన ప్రోత్సాహకాలు, రాయితీలను సర్కార్ ప్రకటించింది. ముంబై తర్వాత దేశంలోనే రెండో అతిపెద్ద క్లౌడ్ కంప్యూటింగ్ రీజియన్గా హైదరాబాద్ను మార్చడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
పెట్టుబడుల స్వర్గధామంగా తెలంగాణ.. సీఎం రేవంత్
భూమి పూజ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణను పెట్టుబడుల స్వర్గధామంగా మార్చడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. దావోస్ పర్యటన నుంచి క్షేత్రస్థాయికి ఈ ప్రాజెక్టు రావడం వెనుక నిరంతర కృషి ఉందన్నారు. రూ. 60 వేల కోట్ల పెట్టుబడితో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టు తొలి విడత పనులు 24 నెలల్లో పూర్తి కానున్నాయని, రాబోయే పదేళ్లలో మిగిలిన దశలను పూర్తి చేస్తామని ప్రకటించారు. దీనివల్ల ఏఐ, డిజిటల్ బ్యాంకింగ్, ఈ-కామర్స్, స్టార్టప్లకు అవసరమైన డిజిటల్ మౌలిక వసతులు మరింత బలోపేతం కానున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
కాలుష్య రహితంగా హైదరాబాద్
మూసీని ప్రక్షాళన చేసి కాలుష్యం లేకుండా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, పరిశ్రమల తరలింపుతో కూడిన 2073 కి.మీ ప్రాంతాన్ని ‘కోర్ అర్బన్ రీజియన్’ (CURE)గా మార్చి.. కాలుష్యరహిత సర్వీస్ సెక్టార్గా అభివృద్ధి చేస్తామని తెలిపారు. హైదరాబాద్ను కాలుష్య రహితంగా మార్చడంతో పాటు ప్రజలకు సౌకర్యాలు కల్పించాలంటే నగరంలోని పరిశ్రమలను తరలించాలని పేర్కొన్నారు.