RTA Officials: స్వేచ్చ బ్యూరో: రహదారిపై సామాన్య వాహనదారుడు చిన్న తప్పు చేసినా ఆర్టీఏ అధికారులు చలానాల మోత మోగిస్తారు. నెంబర్ ప్లేట్ సరిగ్గా లేకపోయినా, హెల్మెట్ లేకపోయినా రూల్స్ అంటారు. కానీ, అదే రూల్స్ తమకు వర్తించవన్నట్లు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు (MVI), అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు (AMVI) వ్యవహరిస్తున్నారని పలువురు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. విధి నిర్వహణలో కనీస నిబంధనలు పాటించకుండా, చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పలు జిల్లాల్లో ఈ అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా, ఉన్నతాధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రచారం జరుగుతుంది.
రవాణా శాఖ నిబంధనల ప్రకారం.. అధికారులు రహదారులపై వాహనాల తనిఖీలు చేపట్టే సమయంలో ఖచ్చితంగా పూర్తి స్థాయి యూనిఫాం ధరించాలి. నేమ్ బ్యాడ్జ్, క్యాప్, బెల్ట్, షూస్ ధరించడం తప్పనిసరి. కానీ క్షేత్రస్థాయిలో సీన్ చూస్తే భిన్నంగా ఉంటోంది. చాలా చోట్ల అధికారులు సివిల్ డ్రస్సుల్లోనే తనిఖీలకు దిగుతున్నారు. మరికొందరు యూనిఫాం వేసినా.. క్యాప్, బెల్ట్ లేకుండా అరకొరగా దర్శనమిస్తున్నారు. ఇప్పడు వారి తీరు విమర్శలకు దారితీస్తుంది.
భూపాలపల్లి జిల్లా చెల్పూర్లోని ఆర్టీఓ కార్యాలయం సమీపంలో గత నెల 22న ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎంవీఐ వెంకన్న మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన కూడా పూర్తి యూనిఫాం ధరించలేదు.లారీ డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యం ప్రమాదానికి కారణం అయినప్పటికీ పూర్తి యూనిఫాం ఉంటే మృతిచెంది ఉండేవారు కాదనే వాదన సైతం వినిపించింది. ఇదెలా ఉంటే రాత్రి వేళల్లో లేదా వేగంగా వెళ్లే వాహనాలను ఆపే సమయంలో రిఫ్లెక్టర్లు, పూర్తి స్థాయి ఖాకీ యూనిఫాం లేకపోవడం వల్ల వాహనదారులు కన్ఫ్యూజ్ అవుతున్నారని, ఇది ప్రమాదాలకు కారణమవుతోందని క్షేత్రస్థాయి నివేదికలు చెబుతున్నాయి.
Also read: తిరుమల టికెట్లు బుక్ చేసుకుంటున్నారా? ఈ తప్పు అస్సలు చేయకండి!
అధికారుల ఉల్లంఘనలు డ్రస్ కోడ్తోనే ఆగడం లేదు. రవాణా శాఖ అధికారులు ప్రయాణించే, తనిఖీలకు ఉపయోగించే ప్రభుత్వ/ప్రైవేటు వాహనాలకు కనీసం నెంబర్ ప్లేట్లు కూడా సరిగ్గా ఉండటం లేదనే ప్రచారం జరుగుతుంది. నెంబర్ ప్లేట్ స్థానంలో కేవలం ‘గవర్నమెంట్ ఆఫ్ టీజీ(టీఎస్)’ లేదా ‘ఆర్టీఏ’ అని రాసి వదిలేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. దీని వెనుక పెద్ద వ్యూహమే ఉందనే ఆరోపణలు వినవస్తున్నాయి. రహదారులపై తనిఖీల పేరుతో కొందరు అధికారులు ప్రదర్శిస్తున్న ‘చేతివాటం’ (అక్రమ వసూళ్లు) బయటపడకుండా ఉండేందుకే నిబంధనల ఉల్లంఘనలు అని విమర్శలు ఉన్నాయి. పూర్తి యూనిఫాం ఉంటే బాధితులు నేమ్ ప్లేట్ చూసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తారు.వాహనానికి నెంబర్ ప్లేట్ ఉంటే.. ఏ వెహికల్ ఎక్కడ ఆపి వసూళ్లకు పాల్పడ్డారో టైమ్, లొకేషన్తో సహా దొరికిపోతారు. అందుకే.. దొరక్కుండా తప్పించుకోవడానికే యూనిఫాంకు, నెంబర్ ప్లేట్లకు పలువురు తిలోదకాలు ఇస్తున్నారనే చర్చ జోరుగా సాగుతోంది.
పలు జిల్లాల్లో పనిచేస్తున్న ఎంవీఐ అధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. సీనియర్లను చూసి జూనియర్ (ఏఎంవీఐ)లు అదే ధోరణిలో వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఉన్నతాధికారులు మాత్రం చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారే తప్ప చర్యలు తీసుకోవడం లేదనే ప్రచారంజరుగుతుంది. ఏసీబీ దాడుల్లో ఆర్టీఏ అధికారులు పట్టుబడుతున్నా క్షేత్రస్థాయిలో మార్పు రావడం లేదు. ఉన్నతాధికారుల ఉదాసీనత వల్లే క్రింది స్థాయి సిబ్బంది ఆడిందే ఆటపాడిందే పాటగా మారిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా రవాణా శాఖ ఉన్నతాధికారులు స్పందించి, రూల్స్ బ్రేక్ చేస్తున్న ఎంవీఐ, ఏఎంవీఐలపై కఠిన చర్యలు తీసుకోవాలని, రహదారి తనిఖీల్లో పారదర్శకత పెంచాలని పలువురు కోరుతున్నారు. ఆదిశగా చర్యలు తీసుకుంటారా? లేదా? అనేది చూడాలి.
Also read: Bonalu Festival: భాగ్యనగరంలో మొదలైన బోనాల సందడి.. పూర్తి షెడ్యుల్ ఇదే..!