Sridhar Babu: స్వేచ్ఛ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం మాజీ ఎమ్మెల్యే జయ ప్రకాష్ నారాయణ,రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్తో కలిసి అల్వాల్లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఎఫ్ డి ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజ్ఞాన్ సేతు సైన్స్ ల్యాబ్ను ప్రారంభించారు.
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోకుండా మౌలిక సదుపాయాలు, నాణ్యమైన విద్యతో అభివృద్ధి చెందాలని ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విద్యార్థులు బాగా చదువుకుని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవడంతో పాటు తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని సూచించారు. ప్రతి ఒక్కరూ స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాని సాధన కోసం కృషి చేయాలని, అర్థం కాని అంశాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవడంలో ఎలాంటి సంకోచం అవసరం లేదన్నారు.
సైన్స్ అంటే భయపడాల్సిన విషయం కాదు..
సైన్స్ అంటే భయపడాల్సిన విషయం కాదని, పరిశోధనాత్మక దృక్పథాన్ని పెంపొందించే శాస్త్రమని వివరించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ల్యాబ్ ద్వారా విద్యార్థులు ప్రయోగాత్మకంగా విజ్ఞానాన్ని నేర్చుకునే అవకాశం లభిస్తుందన్నారు. తాను సైన్స్ విద్యార్థి కాకపోయినా జీవితంలోని అనేక అంశాలు శాస్త్రంతో ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్ల ఏర్పాటు..
ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులే డీఎస్సీ వంటి పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఉపాధ్యాయులుగా సేవలందిస్తున్నారని గుర్తు చేశారు. రాబోయే నాలుగేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసి, ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చేరే పరిస్థితి తీసుకురావాలని ఆకాంక్షించారు. తక్కువ వ్యయంతో ప్రభుత్వ పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్ల ఏర్పాటుకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని తెలిపారు.విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించడంతో పాటు మంచి పౌరులుగా ఎదగాలని మంత్రి పిలుపునిచ్చారు.
Also Read: తిరుమల టికెట్లు బుక్ చేసుకుంటున్నారా? ఈ తప్పు అస్సలు చేయకండి!