Revanthreddy Comments on KCR(TS today news): కేసీఆర్, కేటీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆదివారం గద్వాల జిల్లా ఎర్రవల్లిలో కాంగ్రెస్ జనజాతర సభ నిర్వహించారు. ఈ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పై సీరియస్ అయ్యారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు అమలవుతున్నాయా? అని కేటీఆర్ అడుగుతున్నారని.. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు అమలవుతున్నాయో లేదో తెలియాలంటే కేటీఆర్.. చీర కట్టుకుని బస్సెక్కితే.. ఉచిత పథకాలు అమలవుతున్నాయో లేదో అనేది స్పష్టంగా అర్థమవుతుందని ఆయన అన్నారు. కారు కార్ఖానాకు పోయింది.. ఇగ తూకానికి వేయాల్సిందేనని సీఎం అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించడానికి బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒక్కటయ్యాయని.. ఈసారి ఎన్నికల్లో కూడా కుట్ర పన్నుతున్నాయన్నారు. ఆ పార్టీలకు బుద్ధి చెప్పేలా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తేనే మన నడిగడ్డ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏమీ చేయలేదన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం పక్కా అన్నారు. ఇప్పటికే సెమీ ఫైనల్ లో బీఆర్ఎస్ ను ఓడించాం.. ఫైనల్ లో బీజేపీని ఓడిస్తామని ఆయన అన్నారు. నాగర్ కర్నూల్ ఎంపీగా మల్లు రవిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.
Also Read: రాజ్యాంగం మారితే జరిగేది అదే : నిర్మల్ సభలో రాహుల్ గాంధీ
ఈ సందర్భంగా లక్షా ఓట్ల మెజారిటీతో మల్లును గెలిపిస్తారా అని ఆయన ప్రజలను అడుగగా.. పక్కాగా గెలిపిస్తామంటూ ప్రజలు సమాధానమిచ్చారు. ఈ నెల 9 లోగా రైతుబంధు నిధులు విడుదల చేస్తామన్నారు. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకుంటామన్నారు.